వద్దు, వేంకటేశ్వరుడితో ఎన్టీఆర్ని పోలుస్తారా: బాబుపై జగన్పార్టీ భగ్గు
హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామితో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్)ను పోల్చడం చాలా బాధాకరమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర రెడ్డి మంగళవారం అన్నారు.
తిరుమలకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాగో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ అలా అని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు హిందువు మనోభావాలను కించపరిచేలా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలు హిందుత్వాన్ని అవమానించడంగానే భావిస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంత్రి నారా చంద్రబాబు నాయుడు దయచేసి వ్యక్తులను భగవంతుడితో పోల్చవద్దని ఆయన కోరారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మృతకి పరోక్షంగా మీరే కారణమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెవిరెడ్డి ధ్వజమెత్తారు. అంతకుముందు నందమూరి లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబు వ్యాఖ్యల పైన మండిపడ్డారు.
ఎన్టీఆర్ దేవుడేనని, అందులో ఎలాంటి సందేహం లేదని లక్ష్మీపార్వతి అన్నారు. అయితే ఎన్టీఆర్ దేవుడన్న విషయం చంద్రబాబు చెబితే ఎలా అన్నారు. ఆయనకు వెన్నుపోటు పొడిచాడన్నారు. పదవి నుండి దింపిసేనందుకు చంద్రబాబు నిజంగా పశ్చాత్తాపపడితే ఆ విషయం ఒప్పుకోవాలని సవాల్ చేశారు. బాబు అవకాశవాదిలా మాట్లాడొద్దన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇప్పించుకోలేని చంద్రబాబు, ఆ సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాగా, ఎన్టీఆర్ విగ్రహానికి ఒక శక్తి ఉందని, తిరుమలలోని వేంకటేశ్వరస్వామికి మొక్కుకుంటే, ఆయన దీవిస్తే మీ కష్టాలు ఎలా తీరతాయో ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలచుకుని, ఆయన విగ్రహాన్ని ఒక్కసారి చూసుకుని ఏ సంకల్పం చేసినా, అది జయప్రదం అవుతుందని, దానికి ఢోకానే ఉండదని చంద్రబాబు అన్నారు.
ఎన్టీఆర్ ఒక ఆదర్శమని, ఈ తరాలకే కాకుండా భావి తరాలకు ఆదర్శమని, వేంకటేశ్వరస్వామి ఎలా ఉంటాడో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుడిని చూసుకునే సంస్కృతి వచ్చిందని, ఎన్టీఆర్ దేవుడితో సమానమని, తెలుగు వారి గుండెల్లోంచి ఎన్టీఆర్ను ఎవరూ తొలగించలేరని, ఎన్టీఆర్ రికార్డును ఎన్టీఆర్ తిరిగి పుడితేనే బ్రేక్ చేయగలరని, అంతేతప్ప మరెవరూ చేయలేరని పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులో జరిగిన సభలో చెప్పారు.