నాకు ఆహ్వానం పంపించకు, పిల్చినా రాను: బాబుకు జగన్ లేఖ, 8 కారణాలు ఇవే..
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేడుక కోసం తనకు ఆహ్వానం పంపవద్దని, ఆహ్వానం ఇచ్చినా తాను రాలేదని ఆ తర్వాత అనవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఏపీ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
రాజధాని అమరావతి శంకుస్థాపనకు తాను రాకపోవడానికి ఎనిమిది కారణాలు ఉన్నాయని చెప్పారు. తనకు ఆహ్వానం పంపించవద్దని చెప్పారు. ఆహ్వానం ఇచ్చినా నేను రానని చెప్పారు. పేదల భూములను మీ అత్తగారి సొమ్ములా లాక్కున్నారని ధ్వజమెత్తారు.

మీ బినామీలతో రాజధాని చుట్టూ భూములను కొనిపించారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా రానని, అలాంటప్పుడు తన పైన మంత్రులతో విమర్శలు చేయించవద్దని చెప్పారు. కాగా, లోటస్ పాండ్ నుంచి ఫ్యాక్స్ ద్వారా జగన్ బహిరంగ లేఖ పంపించారు. ఈ లేఖ అందినట్లుగా కూడా తెలుస్తోంది. మీరు నిర్మిస్తోంది ప్రజా రాజధాని కాదన్నారు.
జగన్ చెప్పిన ఎనిమిది కారణాలు ఇవే..
1. ప్రజలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కొని, వారి ఉసురు మీద మీరు రాజధాని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట రైతుల మెడ మీద కత్తిపెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేం పలు సందర్భాలలో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకే రాదల్చుకోలేదు.
2. రాజధాని ప్రాంతంలో సెక్షన్ 30, సెక్షన్ 144ను ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరి ఎందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?
3. గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను రెండింటినీ లెక్క చేయని మీ వైఖరికి నిరసనగా రాదల్చుకోలేదు.
4. అసైన్డ్ భూములు, పేదల భూములు అంటే చులకన స్వభావంతో అవి మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసనగా రాదల్చుకోలేదు.
5. మీ కమిషన్ల కోసం, మీ లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రయివేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లు భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ స్కాంలో మీకు మద్దతు తెలపకూడదన్న భావనతో రాదల్చుకోలేదు.
6. కేంద్రం రూ.1850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగ్ రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు ఏపీకి ఇంకా చేస్తామని కూడా చెబుతోంది. ఈ డబ్బును ఖర్చు చేసి బిల్లులు పెట్టండి ఇంకా చూస్తాం... మీ అవసరం మేరకు అంటోంది. విభజన చట్టం ప్రకారం మనకు కావాల్సినవి అన్నీ నెరవేరుస్తాం అని కేంద్రం చెబుతున్నప్పుడు రాజధాని నిర్మాణానికి ప్రయివేటు సింగపూర్ కంపెనీలతో లేక ప్రయివేటు విదేశీ కంపెనీలతో ఏం పని?
రాజధానిలో ఉండవలసిన హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సింది అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్ చేసి ప్రజలు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో లేక వారి భూములు వారే అట్టిపెట్టుకుంటారో ప్రజల ఇష్టానికి వదిలేయకుండా బలవంతంగా మీ సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల భూములను లాక్కోవడానికి నిరసనగా మేం రాదల్చుకోలేదు.
7. మీ వాళ్లను బినామీలుగా పెట్టుకొని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలను కొనుగోలు చేయించి, వారి భూములు వదిలేసి పేదల భూములు మాత్రం ఇష్టం లేకపోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా మేం రాదల్చుకోలేదు.
8. ప్రజల డబ్బును దుబారా చేస్తూ మీరు ఒక్కరోజు తతంగాన్ని జరిపేందుకు ప్రజల డబ్బు దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసనగా రాదల్చుకోలేదు.
చివరగా ఒక్క మాట అంటూ జగన్ కొనసాగించారు. రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తోంది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధాని అసలే కాదు. ఇది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించేందుకు, రైతుల కడుపు కొట్టేందుకు మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టి ప్రజలందరి తరఫున ఈ దుర్మార్గం వ్యతిరేకిస్తున్నా.












Click it and Unblock the Notifications