తొందరపడి పార్టీని వీడొద్దు...గుంటూరు వైసిపినేత మర్రి రాజశేఖర్ తో ఎమ్మెల్యే ఆర్కే!
గుంటూరు: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,గుంటూరు జిల్లా నేత మర్రి రాజశేఖర్ను మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కలసి తొందరపడి పార్టీని వీడొద్దని సూచించారు.
చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే టికెట్ మహిళా ఎన్నారై రజనీ కుమారికి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మర్రి రాజశేఖర్ తో మాట్లాడేందుకు చిలకలూరిపేట వచ్చిన వైసిపి ఎమ్మెల్యే ఆర్కే ఆయన నివాసగృహంలో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ తనకు జరిగిన అన్యాయం గురించి ఆర్కేతో చెప్పగా దీనిపై స్పందించిన ఆర్కే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని ఈ విషయమై పార్టీలో చర్చ జరుగుతున్నదని రాజశేఖర్తో అన్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు చిలకలూరిపేట ఎమ్మెల్యే టికెట్ విషయమై ప్రచారం నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన వైసీపీ జడ్పీటీసీలు మర్రి రాజశేఖర్ను కలిసి సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా నియోజకవర్గవ్యాప్తంగా పలు గ్రామాలు, పట్టణాల్లోని వివిధ వార్డులకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు మర్రి రాజశేఖర్ నివాసం వద్దకు చేరుకుని భవిష్యత్తు కార్యచరణపై చర్చిస్తున్నారు.
మర్రి రాజశేఖర్కు బాసటగా నిలుస్తున్న వైసిపి నేతలు ఈ సందర్భంగా మాట్లాడుతూ మర్రి రాజశేఖర్ పై అభిమానాన్ని డబ్బుతో కొనలేరని చెప్పారు. మద్దతు కోసం డబ్బుతో ప్రలోభపెడితే లొంగేవారు ఎవరూ ఉండరని వైసిపిలో ఇటీవల చేరిన వి.రజనీ కుమారిని ఉద్దేశించి వ్యాఖ్యనిస్తున్నారు.న్నారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన విడదల రజని వర్గానికి చెందిన కొందరు డబ్బుతో వైసిపి నేతలను తమ వర్గం వైపు మళ్లించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆ క్రమంలో 2వ వార్డు కౌన్సిలర్ అరుణకుమారికి రూ.50 వేలు ఇచ్చి మద్దతు తెలపాలని రజనీకుమారి వర్గీయులు కోరడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకుమారి డబ్బు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. తామంతా రాజశేఖర్ వెంటే ఉంటామని తమను ఎవరూ కొనలేరని చెప్పారు.