'చిరులా కావొద్దు, నీ మాటలు అర్థం కాలేదు', పవన్ కళ్యాణ్కు బోండా ఉచిత సలహా
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన సిపిఐ నేత రామకృష్ణ మంగళవారం నాడు ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన పవన్ ఈ రెండున్నరేళ్లుగా ఎవరిని ప్రశ్నించారని నిలదీశారు.
తెలంగాణలో ఫిరాయింపులను నిరసించిన చంద్రబాబు ఇక్కడెందుకు ప్రోత్సహిస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. దానిని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య చిరంజీవిలాగా కాకూడదని హితవు పలికారు.
చిరంజీవి బాటలో మాత్రం నడవవద్దని హితవు పలికారు. ప్రశ్నిస్తానని, ప్రజల పక్షాన పోరాడుతానని చెప్పి ఇప్పటి దాకా పత్తా లేకుండా పోయారని ఎద్దేవా చంశారు. ప్రతి విషయంలో చంద్రబాబుకు వత్తాసు ఎందుకు పలుకుతున్నారో చెప్పాలని నిలదీశారు.
రాజధాని భూముల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పి, ఆ తర్వాత కనిపించకుండా పోయారన్నారు. కాపులు చేస్తున్న ఉద్యమం పైన పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు.
జగన్కు నాయకత్వ లక్షణాలు లేవు
వైసిపి అధినేత జగన్కు నాయకత్వ లక్షణాలు లేవని, అందుచేతే పలువురు వైసిపి ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడిపోతున్నారని ఏపీ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు సోమవారం అన్నారు. నూజివీడు ఆయన విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును సమర్ధుడైన నాయకునిగా నమ్మి టిడిపిలో చేరుతున్నారన్నారు. ప్రతిపక్షమంటే అధికార పక్ష అభివృద్ధి పనులను ప్రోత్సహిస్తూ, తప్పులు ఎత్తి చూపే వాచ్డాగ్లా ఉండాలి తప్ప మంచిని చెడని, చెడును మంచి అంటూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు.
పవన్ కళ్యాణ్కు బోండ ఉమ ఉచిత సలహా
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ మంగళవారం నాడు ఓ ఉచిత సలహా ఇచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్.. తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలనే ఆలోచన చేస్తున్న విషయం తెలిసిందే.
బస్సు యాత్ర చేయాలా, పాదయాత్ర చేయాలా అని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై బోండా ఉమ స్పందించారు. ఆయన బస్సుయాత్ర చేస్తే మంచిదన్నారు. రాజకీయ నాయకులు బస్సుయాత్ర ద్వారా సమస్యలు తెలుసుకోవచ్చునని చెప్పారు. ప్రస్తుతం జనసేన తమకు మిత్రపక్షమని, భవిష్యత్తులో పవన్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము ముందకు వెళ్తామని చెప్పారు.