వైసీపీ మంత్రికి రెడ్డి ట్యాగ్ సమస్య-తనను అలా పిలవొద్దని సూచన-అసలేం జరిగింది ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ తొలి కేబినెట్ తో పాటు రెండో కేబినెట్లోనూ ఇద్దరు మంత్రులు తమ పేర్లను మార్చుకున్నారు. తమ పేర్లపై ఉన్న అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని సరిచేయించుకున్నారు. దీంతో వారిని కొత్త పేర్లతోనే అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ సంబోధిస్తున్నారు. అయితే తాజాగా మరో మంత్రికి పేరు సమస్య వచ్చింది. అయితే ఇక్కడ వచ్చిన సమస్య వేరు. అధికారిక కార్యక్రమాల్లో తన పేరును మార్చేసి పలకడంపై ఆయన తాజాగా అభ్యంతరం తెలిపారు.
వైసీపీ మంత్రుల పేర్ల సమస్య
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలికేబినెట్ లో మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ తన పేరును మోపిదేవి వెంకట రమణారావుగా మార్చుకున్నారు. జగన్ రెండో కేబినెట్ లోనూ మంత్రి ఉషశ్రీ చరణ్ తన పేరును ఉషా శ్రీ చరణ్ గా మార్చుకున్నారు. వీరిద్దరూ తమ పేర్ల మార్పు కోరుతూ ప్రభుత్వానికి పెట్టుకున్న వినతుల్ని ఆమోదించడంతో ఆయా సందర్భాల్లో వీరు కోరుకున్న పేర్లతోనే వారిని అధికారిక వ్యవహారాల్లో సంబోధించారు. ఇప్పటికీ సంబోధిస్తున్నారు. అయితే తాజాగా ఇదే కోవలో మరో మంత్రి కూడా చేరబోతున్నారు.
గుడివాడ అమర్నాథ్ రెడ్డి
ఏపీలో ప్రస్తుతం భారీ పరిశ్రమలు, ఐటీ మంత్రిగా ఉన్న అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేరు కాస్తా ఇప్పుడు అమర్నాథ్ రెడ్డిగా మారిపోతోంది. ఆయన కోరుకోకుండానే ఈ పేరు అమర్నాథ్ రెడ్డిగా మారిపోతోంది.
తాజాగా తిరుపతిలో అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పేరును అక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలంతా అమర్నాథ్ రెడ్డిగా సంబోధించారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మంంత్రి కాబట్టి తప్పనిసరిగా రెడ్డి అనే ట్యాగ్ ఉండే ఉంటుందని భావించారో లేక మరే కారణంతోనో వారంతా అమర్నాథ్ రెడ్డి అని పిలిచారు. దీంతో రెడ్డి కాని ఈ మంత్రి నొచ్చుకున్నారు.
ఈసారి అలా పిలవొద్దని సూచన
తన పేరు వెనుక రెడ్డి ట్యాగ్ తగిలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మంత్రి అమర్నాథ్ తాజాగా పరిశ్రమల ప్రతినిధులకు ఓ విన్నపం చేశారు. ఈ నెల 16న అనకాపల్లి జిల్లాలో ఏటీజీ టైర్ల కంపెనీ ప్రారంభోత్సవానికి సీఎం జగన్ వస్తున్నారని, ఈ కార్యక్రమంలో తనను కేవలం గుడివాడ అమర్నాథ్ గానే పిలవాలని, రెడ్డి ట్యాగ్ తగిలించవద్దని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు ప్రతినిధులు కూడా సరేనన్నారు. సీఎం జగన్ ముందే తనను రెడ్డి అని పిలిస్తే ఇబ్బందికరంగా ఉంటుందని మంత్రి అమర్నాథ్ భావించిన్నట్లు తెలిసింది. అందుకే ముందే ఈ విషయాన్ని చెప్పేశారు.