పవన్ను బలిచేయొద్దు.., ఇప్పటికైనా!, చరిత్రలో అలా మిగిలిపోవద్దు: బాబుకు ముద్రగడ లేఖ
అమరావతి: 'హోదా మా హక్కు- ప్యాకేజీ మాకొద్దు' అంటున్నారు జగన్. ఏదైతే ఏంటి రాష్ట్రానికి కావాల్సింది నిధులు.. ప్యాకేజీపై పోరాడుతామంటున్నారు చంద్రబాబు. సరే, ప్యాకేజీనే అనుకుందాం.. మరి ఆ నిధులైనా సరిగా ఇచ్చారా?.. లేక తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అబద్దాలడుతుందా? అన్నది తేలుస్తామంటున్నారు పవన్ కల్యాణ్.
మొత్తంగా.. హోదా, ప్యాకేజీల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఆ లేఖలో ఆయనేం చెప్పారంటే..

పవన్ను బలిచేయొద్దు:
'మీ పరపతి నిలబెట్టుకోవడం కోసం ప్రత్యేక ప్యాకేజీ ఉద్యమాన్ని పవన్ కల్యాణ్ మీద వేసి బలిచేయడం న్యాయమైందేనా?' అని ముద్రగడ సీఎంను ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ను బీజేపీకి దూరం చేశారని గుర్తుచేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం రోడ్డెక్కి పోరాడాలని సూచించారు.

దొరికిపోయి.. రాజీపడ్డారు:
ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన తర్వాతే కేంద్రంతో చంద్రబాబు రాజీ పడి ప్యాకేజీకి ఒప్పుకున్నారని ముద్రగడ అన్నారు. లేకపోతే తిరుపతి సభలో ఆంధ్రప్రదేశ్కు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న చంద్రబాబు.. మళ్లీ మాట ఎందుకు మార్చారని నిలదీశారు. ఎన్నికల హామిలపై తాను, బీజేపీ నేతలు నిలదీస్తే వైఎస్ జగన్కు అమ్ముడు పోయారని ఎదురు దాడి చేయడం టీడీపీకి అలవాటైపోయిందన్నారు.

రాజీనామాలు చేయించండి..:
రాష్ట్రానికి ఇచ్చిన హోదా, విభజన హామిలను కేంద్రం నుంచి తెచ్చుకోవాలంటే జగన్, పవన్, లేదా తనలాంటి వారు సరిపోరని ముద్రగడ అన్నారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా.. తమ పార్టీకి చెందిన కేంద్రమంత్రులతో, ఎంపీలతో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

అలా మిగిలిపోవద్దు..:
సీఎం హోదాలో చంద్రబాబు ముందుండి హోదా ఉద్యమాన్ని నడిపించాలన్నారు ముద్రగడ. చంద్రబాబు అందుకు సిద్దమైతే రాష్ట్రమంతా ఆయన వెంటే కదులుతుందన్నారు. చరిత్రలో గొప్పవారిగా ఉండిపోయేందుకే ప్రయత్నించాలని, చెడ్డవాళ్లుగా ముద్ర వేయించుకోవద్దని హితవు పలికారు.












Click it and Unblock the Notifications