సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు- హోంశాఖకు పంపిన డీవోపీటీ
ఏపీ సీఐడీ ఛీఫ్ పీవీ సునీల్ కుమార్ కు కేంద్రం ఉచ్చు బిగిస్తోంది. విద్వేష ప్రసంగాల వ్యవహారంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు రఘురామరాజుకు సమాచారం కూడా పంపింది.
పీపీ సునీల్ కుమార్ హిందువులకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేసినట్లు ఆధారాలను రఘురామకృష్ణంరాజు సిబ్బంది వ్యవహారాలశాఖకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ దీన్ని కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపింది. అక్కడ సునీల్ కుమార్ వ్యవహారంపై హోంశాఖ ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని సిబ్బంది వ్యవహారాలశాఖ అమలు చేస్తుంది. దీంతో హోంశాఖ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
Recommended Video
అఖిలభారత సర్వీసు అధికారి అయిన పీవీ సునీల్ కుమార్ ఓ మతాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేయడంపై స్పందించిన సిబ్బంది వ్యవహారాలశాఖ తదుపరి పరిశీలనకు హోంశాఖకు రఘురామకృష్ణంరాజు రాసిన లేఖను పంపినట్లు తెలుస్తోంది. సునీల్ కుమార్ ఐపీఎస్ కావడం, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్ధితే వస్తే హోంశాఖ అనుమతి తప్పనిసరి కావడంతో ముందుగా ఆయన బిజినెస్ రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవరించారా లేదా అన్న దానిపై హోంశాఖ పరిశీలన చేయబోతోంది. దీంతో ఈ వ్యవహారం ఏపీలో చర్చనీయాంశమవుతోంది.