విజయవాడలో పట్టపగలే డబుల్ మర్డర్..! ఏం జరిగిందంటే ?
ఏపీలోని విజయవాడలో ఇవాళ పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అన్నపూర్ణ ధియేటర్ సమీపంలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం దాడికి దిగారు. మద్యం మత్తులో ఉన్న వీరిద్దరూ కత్తులు, రాళ్లతో దాడి చేసుకుని ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యలకు దారి తీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన ఇద్దరూ కేటరింగ్ చేసే యువకులుగా భావిస్తున్నారు.
ఇవాళ ఉదయం విజయవాడ నగరంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కలకలం రేగింది. నగరంలోని గవర్నర్ పేట సమీపంలో జంట హత్యలు జరిగాయన్న సమాచారంతో జనం భయాందోళనలకు గురయ్యారు. విజయవాడ నగరానికి చెందిన ఒకరు, విజయనగరానికి చెందిన మరొకరు మద్యం మత్తులో పరస్పరం వ్యక్తిగత కారణాలతో దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో వీరు కత్తులు వాడినట్లు పోలీసులు చెప్తున్నారు. దాడుల్లో ఇద్దరూ తీవ్ర గాయాల పాలవ్వడంతో రక్తపుమడుగులో హతులై తేలారు.

గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ సమీపంలోని అన్నపూర్ణ థియేటర్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడి మృతిచెందినట్లు వెల్లడించారు. మృతుల వివరాలు మాత్రం తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వీటిలో ఏదైనా క్లూ దొరికితే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications