వివేకా హత్యకేసులో అప్రూవర్ గా దస్తరిగి- పూర్తి సమాచారం తెలుసంటూ : ఆ ముగ్గురు చూట్టూనే...!!
మాజీ మంత్రి..సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. హత్య జరిగిన రోజున ఉమాశంకర రెడ్డి రోడ్డు పైన పరిగెత్తుతున్న వీడియో ఫుటేజ్ సీబీఐ అధికారులు సేకరించారు. దానిని సాంకేతికంగానూ రుజువు చేసారు. అదే సమయంలో వివేకా ఇంటి గోడ దూకి మరో ముగ్గురు వెళ్లిన అంశాన్ని సీబీఐ గుర్తించింది. ఇక, ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారిన వివేకా మాజీ డ్రైవర్ వ్యవహారంలో ఆసక్త కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి.
దస్తగిరి అప్రూవర్ గా మారటంతో
దస్తగిరి అప్రూవర్ గా మారనున్నారు. దస్తగిరి అప్రూవర్గా మారుతున్నారని... విచారణకు సహకారం అందిస్తున్న కారణంగా అతని సాక్ష్యాన్ని నమోదు చేయాలని సీబీఐ అధికారులు కడప సబ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దస్తగిరిని నిందితులుగా చేర్చింది. హత్యకు ముందు ఎర్రగంగిరెడ్డి నివాసంలో వీరంతా భేటీ అయినట్లుగా సీబీఐ పేర్కొంది. ఛార్జిషీట్ వేయడానికి ముందే, అంటే అక్టోబరు 22న దస్తగిరి కడప కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నారు.
కేసు గురించి పూర్తి సమాచారం దొరికినట్లేనా
అదే రోజు సీబీఐ.. కడప సబ్ కోర్టులో అప్రూవర్ పిటిషన్ దాఖలు చేసింది. షేక్ దస్తగిరి సీఆర్పీసీ 306 సెక్షన్ కింద అప్రూవర్గా మారుతున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది. వివేకా హత్య కేసులో దస్తగిరితో పాటు ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు తెలిపింది. ఇంతకు ముందు దస్తగిరి సీబీఐకి, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిగింది. కేసు పురోగతి విషయంలో సహకరించడానికి దస్తగిరి సిద్ధంగా ఉన్నాడని కోర్టుకు సీబీఐ తెలిపింది. హత్యకు సంబంధించిన అన్ని విషయాలు దస్తగిరికి తెలుసని వెల్లడించింది.
అతని సాక్ష్యంగా కీలకంగా
కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే అతని సాక్ష్యం నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై మిగతా ముగ్గురు నిందితుల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరి నుంచి రికార్డు చేసిన స్టేట్మెంట్, మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం పత్రాలు చూసిన తర్వాతే కౌంటర్ వేస్తామని తెలిపారు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం ఆ పత్రాలను ఇవ్వాలని సీబీఐకి సూచిస్తూ విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
Recommended Video
సీబీఐకి మరింత సహకరించే విధంగా
ఇక, ఈ కేసు రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఈ కేసు పైన ప్రతిపక్ష పార్టీలు అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నాయి. సీబీఐ అధికారులు సైతం పలువురిని ఈ కేసులో భాగంగా విచారించారు. ఇప్పుడు ఆ నలుగురు ఈ కేసులో కీలకంగా మారారు. ఇక, దస్తగిరి అప్రూవర్ గా మారటంతో మిగిలిన ముగ్గురి పాత్ర ఏంటనేది ఆయన నుంచి ఆధారాలతో సహా సేకరించేందుకు సీబీఐ సిద్దం అవుతోంది.