జగన్ ఇంటికి డీఎస్సీ అభ్యర్ధులు..! ప్లకార్డులతో నిరసనలు..!
ఏపీలో కూటమి సర్కార్ తాజాగా మెగా డీఎస్సీ నిర్వహించింది. 16 వేలకు పైగా ఉద్యోగాలను ఇందులో భర్తీ చేసింది. గతంలో వైసీపీ సర్కార్ 6 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి 16 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన అభ్యర్ధులకు అపాయింట్ మెంట్ లెటర్లు కూడా ఇచ్చింది. దీంతో డీఎస్సీలో ఎంపికైన వారు ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే ఇప్పుడు ఎంపిక కాని అభ్యర్ధులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ తలుపు తట్టారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ అధినేత వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం కమ్ ఇంటి వద్ద ఇవాళ భారీగా డీఎస్సీ అభ్యర్ధులు తరలివచ్చారు. తాజా డీఎస్సీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ ప్లకార్డులతో నిరసనలకు దిగారు. డీఎస్సీలో తాము ఎంపిక కాకపోవడానికి ఈ అక్రమాలే కారణమని ఆరోపించారు. జగన్ ను కలిసేందుకు వారు తరలివచ్చారు. విషయం తెలుసుకున్న వైసీపీ వర్గాలు తాడేపల్లి నివాసంలోనే ఉన్న జగన్ కు సమాచారం ఇచ్చారు.

దీంతో జగన్ బయటికి వచ్చారు. డీఎస్సీ అభ్యర్ధులను కలిశారు. పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని డీఎస్సీ అభ్యర్ధులు చేసిన ఆరోపణలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ తమకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్ధులు ఆయన్ను కోరారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్ జగన్ను కోరారు. దీంతో సానుకూలంగా స్పందించి జగన్.. డీఎస్సీ అభ్యర్ధులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చి పంపారు.

ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీ పరీక్షల ఫలితాలు వచ్చి ఎంపికైన వారంతా ఉద్యోగాల్లో కూడా చేరిపోయారు. ప్రభుత్వం డీఎస్సీని విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పుకుంది. ఇలాంటి సమయంలో డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఎంపిక కాని అభ్యర్ధులు ఇలా జగన్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.












Click it and Unblock the Notifications