కృష్ణా పుష్కరాలు: దుర్గా ఘాట్లో చంద్రబాబు, గొందిమల్లలో కేసీఆర్
అమరావతి: ఆగస్టు 12 నుంచి 23 వరకు తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న కృష్ణా పుష్కరాలు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సర్వం సిద్ధం చేశాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఏపీలో కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పూర్తి వివరాలను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు మంగళవారం మీడియాకు వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజైన ఆగస్టు 12 (శుక్రవారం) ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్లో పుష్కర స్నానమాచరిస్తారు. దుర్గాఘాట్ వీఐపీ ఘాట్ కావడంతో వీఐపీలంతా అక్కడ స్నానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో కృష్ణా పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
అదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా స్నానం చేయనున్నారు. ఇదిలా ఉంటే మహబూబ్నగర్ జిల్లా గొందిమల్లలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లో ఈనెల 12న సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం చేయనున్నారు. ఏపీలో పుష్కరాల్లో మొత్తం 62వేల మంది ఉద్యోగులు పుష్కరాల్లో సేవలందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కృష్ణా నది తీరంలోని 1120 ప్రాంతాల్లో ఉంటారని తెలిపారు. అత్యవసర సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని, జిల్లాలో మొత్తం ఏడు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఒక్కో ఘాట్కు ఒక్కో రిఫరల్ ఆసుపత్రిని గుర్తించామని చెప్పారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామని చెప్పిన ఆయన పది లక్షల మంది పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
తద్వారా ఎవరైనా తప్పిపోతే సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. పుష్కరాల్లో భాగంగా 54 స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. ప్రతి ఘాట్కు ఒక ఇన్చార్జి ఉంటారని, మల్టీ డిసిప్లెయినరీ టీం కూడా ప్రతి ఘాట్కు ఉంటుందని వివరించారు. మొత్తం 45 పుష్కర నగర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
పుష్కర ఘాట్లకు రోజుకు 400 బస్సులు తిరుగుతాయని, స్నానాలు పూర్తిచేసుకున్న తర్వాత తిరిగి పుష్కర్నగర్లో వారిని బస్సుల్లో ఉచితంగా దించుతాయాని ఆయన తెలిపారు. పుష్కరాలం కోసం ప్రత్యేకంగా 380 రైళ్లు కొత్తగా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 26 సెల్ టవర్స్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.
1400 సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టంను నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఏ సమాచారం కావాలన్నా తగిన ఫోన్ నంబర్లు, అధికారుల వివరాలతో ఒక పుస్తకం ప్రచురించామని, ఆ పుస్తకాలు ఆయా ఘాట్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపారు.
గొందిమల్లలో సీఎం కేసీఆర్ దంపతుల పుష్కరస్నానం
మహబూబ్నగర్ జిల్లా గొందిమల్లలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్లో ఈనెల 12న సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం చేయనున్నారు. అక్కడ జరుగుతోన్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను మంగళవారం తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుష్కర ఘాట్ల ఏర్పాట్ల పనులు నూటికి 99 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా యంత్రాంగం నెలరోజుల నుంచి పనుల్లో నిమగ్నమైందని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏడు వేల మంది పోలీసులు రంగంలోకి దిగనున్నారని ఆయన పేర్కొన్నారు.
పుష్కరాలకు పటిష్ట బందోబస్తు: డీజీపీ సాంబశివరావు
కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 35 మంది ఐపీఎస్ అధికారులతో పుష్కరాలను పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన అన్నారు. బందోబస్తు విధుల్లో భాగంగా 31 వేల 400 మంది పోలీసులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకల నుంచి కేంద్ర బలగాలను రప్పించినట్టు ఆయన తెలిపారు.
పుష్కరం అంటే?
బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు జరుపుకొనే వేడుకను పుష్కరం అంటారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడు. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదనే నిబంధన ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో స్నానం చేస్తారు.