అత్యాధునిక సౌకర్యాలతో దేశంలోనే తొలి ఈ-బస్ బే: ప్రత్యేకతలివే
దేశంలోని తొలి ఈ-బస్ బే గుంటూరులో నిర్మితమవుతోంది. లక్ష్మీపురం మీసే కూడలి వద్ద అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న ఈ బస్ బే పనులు దాదాపూ పూర్తయ్యాయి.
అమరావతి: దేశంలోని తొలి ఈ-బస్ బే గుంటూరులో నిర్మితమవుతోంది. లక్ష్మీపురం మీసే కూడలి వద్ద అత్యాధునిక హంగులతో నిర్మితమవుతున్న ఈ బస్ బే పనులు దాదాపూ పూర్తయ్యాయి. కాగా, దీని నిర్వహణ, సౌకర్యాలు కల్పించే బాధ్యత అంతా ఓ ప్రైవైటు ఏజెన్సీ వారే అందిస్తుండటం గమనార్హం. అయితే, పాలన మాత్రం గుంటూరు నగర పాలక సంస్థే చూసుకోనుంది.
రూ.40లక్షలతో రూపుదిద్దుకుంటున్న ఈ బస్ బే ప్రజలకు అనేక ప్రత్యేక సౌకర్యాలను కలిగించనుంది. సింగపూర్, రష్యా, మలేషియా లాంటి దేశాల్లో మాత్రమే ఉన్న ఇలాంటి ఈ బస్ బేలు తొలిసారి ఇక్కడే నిర్మిస్తుండటం విశేషం.
ఈ బస్ బే ద్వారా ప్రయాణికులకు అందనున్న సేవలను గమనించినట్లయితే.. ఏసీతోపాటు వైఫీ సౌకర్యం ఉంటుంది. ఒకేసారి 50-60మంది ప్రయాణికులు సేదతీరేందుకు అవసరమైన ఏర్పాట్లున్నాయి. ప్రథమ చికిత్సకు అవసరమయ్యే కిట్లు కూడా అందుబాటులో ఉంటాయి.
ఒకేసారి 20మంది తమ ఫోన్లను ఛార్జీంగ్ చేసుకునే వెలుసులుబాటును కల్పించారు. బ్యాంక్ ఏటీఎం సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేస్తున్నారు.
మరుగుదొడ్లు కూడా ఆధునిక పద్ధతుల్లో నిర్మాణం చేశారు. అంతేగాక, 24గంటలపాటు వాచ్మెన్లు అందుబాటులో ఉంటారు. 24/7ఆర్వో విధానం ద్వారా శుద్ధమైన తాగునీరు అందుబాటులో ఉంటుంది. ఈ బే చుట్టూ కూడా మొక్కలను పెంచి ఆహ్లాదంగా తయారు చేస్తున్నారు. ఇన్ని అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ బస్ బే త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.