5.3 తీవ్రతతో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన భూకంపం: కేంద్ర బిందువు అక్కడే
Earthquake: భూకంపం రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. అయినప్పటికీ జనం భయంకపితులయ్యారు. ఇళ్ల నుంచి బయటికి పరుగులు పెట్టేలా చేసింది. చాలాసేపటి వరకు రోడ్ల మీదే గడిపారు. ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.
తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ ఉదయం 7:27 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా రికార్డయింది. ఉపరితలం నుంచి 40 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.

అదే సమమయంలో ఏపీ, తెలంగాణల్లో ఈ భూప్రకంపనలు సంభవించాయి. కొన్ని చోట్ల రెండు సెకెన్ల పాటు భూమి ప్రకంపించింది. మరికొన్ని ప్రాంతాల్లో 3 నుంచి 4 సెకెన్ల పాటు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. దాదాపుగా ఒకే సమయంలో వేర్వేరు నగరాలు, పట్టణాల్లో భూమి ప్రకంపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏపీలో కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెంలల్లో ప్రకంపనలు నమోదయ్యాయి. ఇక్కడ దీని తీవ్రత రెండు సెకెన్ల పాటు కొనసాగింది. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి సహా వేర్వేరు జిల్లాల్లో ప్రకంపనలు నమోదయ్యాయి.

వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దీని తీవ్రత 3 నుంచి 4 సెకెన్ల పాటు కనిపించింది. హన్మకొండ, ఖమ్మం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలంలల్లో భూమి ప్రకంపించింది. దీని తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం రికార్డయింది.
ఊహించని విధంగా ఈ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కట్టుబట్టలతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు. సురక్షిత ప్రదేశాలకు చేరుకున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అందలేదు.












Click it and Unblock the Notifications