జగన్ పార్టీకి ఈసి గుర్తింపు, టిడిపిలోకి జంపింగ్స్కు చెక్!
లోకసభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సాధించిన ఓట్ల శాతాన్ని సమీక్షించాక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రకటనలో తెలిపిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పేర్కొంది. 1968 ఎన్నికల సింబల్ ఉత్తర్వు ప్రకారం జగన్ పార్టీకి సీలింగ్ ఫ్యాన్ను రిజర్వ్ చేసినట్లు ఈసి సమాచారం ఇచ్చిందని పార్టీ తెలిపింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి పలువురు ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీలోకి చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టిడిపిలో చేరగా, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక టిడిపికి అనుబంధ సభ్యురాలిగా ఉంటానని తెలిపారు.
మరికొందరు ఎమ్మెల్యేలు టిడిపి పంచన చేరనున్నారని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కర్నూలు జిల్లా నుండి పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారంటున్నారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరితే విప్ వర్తించదని, ఆ పార్టీ రిజిస్టర్డ్ పార్టీయే తప్ప రికగ్నైజ్డ్ పార్టీ కాదని టిడిపి చెబుతుండగా, తమకు గుర్తింపు వస్తుందని.. విప్ చెల్లుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెబుతూ వచ్చింది. ఇప్పుడు గుర్తింపు రావడంతో వలసలు ఆగేనా అనే చర్చ సాగుతోంది.