తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఎన్నికల వేడి: బిగ్ ఫైట్: ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కంప్లీట్ లిస్ట్ ఇదే
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఏపీలో ఇప్పటికే మిగిలిపోయిన మున్సిపాలిటీలతో పాటు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోసం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం మధ్య పోటాపోటీగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలను ఎదుర్కొంటోన్న మున్సిపాలిటీల్లో- టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం కూడా ఉండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
Recommended Video
బీజేపీ తోకపార్టీగా టీడీపీ: దమ్మున్న మగాడు జగన్: పీకే పవన్ కల్యాణ్: కొడాలి నాని మార్క్ ఫైర్
రెండు చోట్లా ఎన్నికల కోలాహలం..
అదే సమయంలో- తాజాగా శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్.. కొద్దిసేపటి కిందటే ఈ నోటిఫికేషన్లను వేర్వేరుగా విడుదల చేసింది. ఫలితంగా- రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరోసారి ఎన్నికల వాతావరణం, కోలాహలం నెలకొనబోతోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలను ఎన్నుకోవాల్సి ఉన్నందున.. మెజారిటీ సంఖ్యలో ప్రజా ప్రతినిధులు ఉన్న పార్టీ అత్యధిక ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీ లిస్ట్ ఇదే..
ఏపీ శాసన మండలిలో ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారిలో 11 మంది సభ్యుల సభ్యత్వ కాల పరిమితి ముగిసింది. వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. అనంతపురం, కృష్ణా, తూర్పు గోదావరి, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా నుంచి ఆయా పార్టీలకు చెందిన సభ్యుల కాల పరిమితి ముగిసింది. మొత్తం 11 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు.
ఏ జిల్లా నుంచి ఎవరు..?
అనంతపురం జిల్లా నుంచి టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ టర్మ్ ముగిసింది. కృష్ణా జిల్లా నుంచి అదే పార్టీకి చెందిన బుద్ధా వెంకన్న, యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ పదవీ విరమణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, గుంటూరు జిల్లా నుంచి అన్నం సతీష్ ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయనగరం స్థానిక సంస్థల కోటా నుంచి ద్వారపురెడ్డి జగదీశ్వర రావు, విశాఖపట్నం నుంచి బుద్ధా నాగ జగదీశ్వర రావు, పప్పల చలపతి రావు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి గాలి సరస్వతి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి శాసన మండలి సభ్యత్వ కాల పరిమితి కిందటి నెల 11వ తేదీ నాటికి ముగిసింది. మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు, గోవిందరెడ్డి పదవీకాలం ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.
తెలంగాణ లిస్ట్ ఇదే..
తెలంగాణ శాసన మండలిలో ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న వారిలో 12 మంది సభ్యుల సభ్యత్వ కాల పరిమితి ముగిసింది. వాటిని భర్తీ చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల కోటా నుంచి ఆయా పార్టీలకు చెందిన సభ్యుల కాల పరిమితి ముగిసింది. మొత్తం 12 మంది సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంది.
వచ్చేనెల 10న పోలింగ్..
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. డిసెంబర్ 10న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది. అదే నెల 14వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తుంది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 23వ తేదీ చివరి గడువు. ఆ మరుసటి రోజే నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. వాటిని ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 26. వచ్చేనెల 10వ తేదీన ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుంది ఈసీ. 14వ తేదీన ఓట్ల లెక్కింపును చేపడుతుంది.