రేవంత్ కేసులో రంగంలోకి ఈడి: బాబు లక్ష్యంగా టీఆర్ఎస్, జగన్ హెల్ప్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముడుపుల వ్యవహారంలో ఈడి దృష్టి సారించింది. సంఘటన స్థలంలో ఏసీబీ స్వాధీనం చేసుకున్న రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి? చట్టబద్ధమైన సొమ్మేనా అన్న విషయాలను ఈడీ పరిశీలించనుంది.
రూ.25 లక్షలు దాటిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులన్నింటినీ ఈడికి పంపాలని ఏసీబీ గతంలోనే నిర్ణయించింది. ముడుపుల సొమ్ము, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) పరిధిలోకి వస్తున్నందున, ఈడీ కేసు నమోదు చేసే యోచనలో ఉంది.
ఈడీకి అప్పగించడం ద్వారా రేవంత్ కేసు కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడునును సైతం భాగస్వామిగా చేసేందుకు ఉన్న అవకాశాలపై తెరాస తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే చంద్రబాబు పాత్ర పైనా విచారణ జరపాలంటూ తెరాస మంత్రులు, పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఒక పరస్పర అవగాహనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ను కూడా రంగంలోకి దించినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి.
తెలంగాణలో కేసీఆర్కు, జగన్కు ఉమ్మడి రాజకీయ శత్రువు చంద్రబాబు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను కలిసిన సందర్భంలో రేవంత్ తన మాటల్లో అన్యాపదేశంగా బాస్ ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ఈ కేసులోకి చంద్రబాబును కూడా లాగడంపై తెరాస దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
తెర ముందు జగన్ను నిలిపి తెర వెనుక తెరాస పావులు కదుపుతోందని చెబుతున్నారు. రేవంత్ కేసులో చంద్రబాబు పాత్ర కూడా ఉందని, ఆయనపై కూడా కేసు నమోదు చేసి విచారణ జరపాలని జగన్ మంగళవారం గవర్నర్ నరసింహన్ను కలిసి ఒక లేఖ ఇచ్చారు.
త్వరలో ఇదే డిమాండ్తో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కూడా కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుపై తెలంగాణ ప్రభుత్వం కేసు నమోదు చేసినా, ఏ చర్యకు ఉపక్రమించినా అది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారే అవకాశం ఉందని తెరాసలో కొందరు నాయకులు భావిస్తున్నారు.
తమ చేతికి మట్టి అంటకుండా ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ పార్టీల డిమాండ్, ఒత్తిడి మేరకు చర్యలు తీసుకుంటే తమకు ఇబ్బంది ఉండదన్నది వారి ఆలోచన. దీనిపై తెరాస, వైసీపీ మధ్య ఏకీభావం కుదిరిందని, అందులో భాగంగానే జగన్ రంగంలోకి దిగి చంద్రబాబుపై చర్య తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నారని అంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగా రూ.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, ఈ అంశాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మనీలాండరింగ్ కేసు కూడా నమోదైతే చంద్రబాబును మరింత చిక్కుల్లోకి నెట్టవచ్చునని భావిస్తున్నారు.
రేవంత్ ఖైదీ నెంబర్ 4170
రేవంత్ రెడ్డిని చంచల్ గూడ జైలు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు. చంచల్ గూడలో అతను ఖైదీ నెంబర్ 1779 కాగా, చర్లపల్లిలో 4170 నెంబర్ కేటాయించారు.
రేవంత్ కస్టడీ కోరుతు ఏసీబీ పిటిషన్
రేవంత్ రెడ్డి కస్టడీని కోరుతూ ఏసీబీ బుధవారం నాడు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. నగదు వివరాల సేకరణ వివరాలకు కస్టడీ కోరింది. రేవంత్ రెడ్డిని పూర్తిగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని ఏసీబీ కోరింది.