జగన్కు మరో షాక్: 700 షెల్ కంపెనీల్లో ఈడీ సోదాలు, కృతిక అరెస్ట్
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జగన్ బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఇటీవల పిల్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా నల్లధనంపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జరిపిన దాడుల్లో జగన్కు చెందిన ఓ సూట్కేస్ కంపెనీ బయటపడింది. దేశ వ్యాప్తంగా ఏకకాలంలో వంద చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. రూ. 3.04 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
ముంబైలో ఒకే అడ్రస్తో 700 సూట్కేస్(షెల్) కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఇప్పటికే 300కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. అందులో రాజేశ్వర్ ఎక్స్పోర్టు కంపెనీ పత్రాలను పరిశీలించిన ఈడీ.. అది వైయస్ జగన్కు చెందినదిగా గుర్తించింది. నోట్ల రద్దు సమయంలో రాజేశ్వర్ ఎక్స్పోర్టు కంపెనీ నుంచి రూ. 1478 కోట్లను హాంకాంగ్కు మళ్లించినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.
జగన్కు చెందిన షెల్ కంపెనీ ద్వారా రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ కంపెనీకి ఈ రూ. 1478 కోట్లు చేరినట్లు ఈడీ సోదాల్లో బయటపడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ కంపెనీ యాజమాన్యంతో జగన్కు ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీస్తోంది. రాజేశ్వర్ ఎక్స్పోర్టు యజమాని కృతికను ఫిబ్రవరి 27న అరెస్టు చేశారు.
రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ కంపెనీతో జగన్కు ఉన్న సంబంధాలను తెలుసుకోవడం కోసం ఆయనను ఈడీ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వైయస్ జగన్కు చెందిందని ఆ సంస్థ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
ED searches at shell companies related to Y S Jagan Reddy Rajeshwar Exports & others to unearth their modus operandi
— ED (@dir_ed) April 1, 2017
కాగా, యాదవ్సింగ్, చగన్భుజ్భల్ కంపెనీల్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం 700 సూట్కేస్ కంపెనీల్లో 20 మంది డమ్మీ డైరెక్టర్స్ ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ఎన్సీపీ నేత అయిన ఛగన్భజ్భల్ కోసం రూ. 291.71 కోట్ల పాతనోట్లు మార్పిడి జరిగినట్లు ఈడీ సోదాల్లో తెలిసింది. హైదరాబాద్కు చెందిన విశ్వజ్యోతి రియల్టర్స్ కంపెనీకి సంబంధించిన రూ. 3.04 కోట్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
సూట్కేస్ కంపెనీలతో జగన్కున్న సంబంధాలపై ఆరా తీసింది. నల్లధనం, అక్రమలావాదేవీలపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం అక్రమార్కుల భరతం పట్టడానికి అన్ని అంశాలను పరిశీస్తూ ముందుకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పలు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ ఈ రోజు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.