VijayaSai Reddy: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్..! ఈడీ సమన్లు..!
ఏపీలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాకిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై సీఐడీ దర్యాప్తు ఆధారంగా ఈడీ కూడా విచారణ జరుపుతోంది. ఇదే క్రమంలో గతంలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఇప్పుడు ఆయన్ను ప్రశ్నించాలని భావిస్తోంది. దీనికోసం సాయిరెడ్డిని తమ విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది.
వైసీపీ హయాంలో మద్యం డిస్టిలరీల నుంచి ముడుపుల సేకరించి ప్రభుత్వ పెద్దలకు అందజేసిన వ్యవహారంలో ఇప్పటికే రాష్ట్ర సీఐడీ విభాగానికి చెందిన సిట్ విజయసాయిరెడ్డిని నిందితుల జాబితాలో చేర్చింది. సాయిరెడ్డి ఇంట్లోనే మద్యం స్కాంకు సంబంధించిన చర్చలు జరిగేవని, ఇందులో ఇతర నిందితులు కూడా పాల్గొనే వారని సిట్ ఆరోపిస్తోంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ఈ నెల 22న విచారణకు రావాలని సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే అంతకు ముందే మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డే అంతా చేశాడంటూ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో ఆయన్ను సీఐడీ విచారణకు పిలిపించింది. విచారణలో సాయిరెడ్డి మద్యం స్కాం ఎలా జరిగిందో మొత్తం వివరించారు. అయితే అనూహ్యంగా సీఐడీ ఎఫ్ఐఆర్ లో సాయిరెడ్డిని కూడా నిందితుడిగా చేర్చింది. దీంతో సాక్షిగా మొదలైన సాయిరెడ్డి లింక్ కాస్తా నిందితుడిగా మారింది. ఇప్పుడు ఈడీ విచారణ తర్వాత సాయిరెడ్డిని తమ కేసులోనూ నిందితుడిగా చేరిస్తే ఇబ్బందులు తప్పకపోవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications