ఏపీలో సోషల్ మీడియా పోస్టుల ఎఫెక్ట్... ఓ కానిస్టేబుల్ సస్పెండ్; టీడీపీ మహిళానేతకు సీఐడీ నోటీసులు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే టీడీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టుల దెబ్బకు సీఐడీ నోటీసులు అందుకుంటున్నారు. సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరవుతున్నారు.
సీఎం జగన్ పై అనుచిత పోస్ట్.. ఆ కానిస్టేబుల్ సస్పెన్షన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీసు వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టినందుకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన్ కుమార్ శెట్టిని అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమీ శాలి సస్పెండ్ చేశారు. అచ్యుతాపురం బ్రాండిక్స్ లో అమ్మోనియా విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన అంశానికి సంబంధించి ఒక పోస్టులో చివర అన్న వచ్చాడు అస్వస్థత తెచ్చాడు అంటూ క్యాప్షన్ పెట్టి మరి పోలీస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినట్టు నవీన్ కుమార్ పై ప్రాథమిక ఆరోపణ ఉన్నట్టుగా సమాచారం.
జగన్ పై, ఏపీ సర్కార్ పై తప్పుడు పోస్టులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరిక
పోలీస్ గ్రూపులో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టినందుకు కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసిన జిల్లా ఎస్పీ గౌతమి సాలి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు. అయితే ఏపీ ప్రభుత్వంపై కానీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై కానీ కించపరిచే విధంగా పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఇక అంతే కాదు కొద్ది రోజులుగా వాట్సప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో ఏపీ ప్రభుత్వంపై జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టి మరీ, వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు పోలీసులు.
టీడీపీ నేతలకు సీఐడీ నోటీసులు,... గౌతు శిరీష విచారణకు హాజరు కావాలన్న సీఐడీ
ఇక మరోవైపు సిఐడి అధికారులు కూడా రంగంలోకి దిగి సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారికి నోటీసులు ఇస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలపై ఫోకస్ చేసిన సిఐడి అధికారులు తాజాగా సోషల్ మీడియాలో నకిలీ ప్రకటనలను పోస్ట్ చేశారన్న ఆరోపణలతో టిడిపి నాయకులు గౌతు శిరీషకు నోటీసులు అందజేశారు. అంతకు ముందు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ముఖ్య అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ప్రభుత్వం రద్దు చేసిందని లబ్ధిదారులకు ఈ రెండు పథకాలు అందవని ప్రభుత్వ చిహ్నంతో ఉన్న నకిలీ ప్రకటనను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై అధికారులు ఆమెకు ఈ నోటీసు ఇచ్చారు.