పచ్చ మధు హత్యకేసులో అనుచరుడు సహా 8 మంది అరెస్టు
ఏలూరు: పచ్చ మధు హత్య కేసులో ప్రధాన నిందితుడు కృష్ణ సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 13వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా గున్నంపల్లిలో పచ్చ మధు హత్యకు గురయ్యాడు. పచ్చా మధు హత్యకు నిందితులు రూ.20 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి వద్ద ఒక మద్యం దుకాణం వద్ద కాల్పులు జరిపిన సంఘటనలో పచ్చ మధు మరణించిన విషయం తెలిసిందే. కాల్పుల్లో మరణించిన పచ్చా మధు తాడేపల్లిగూడెం వాసి. పచ్చ మధు తన సోదరుడు దుర్గాప్రసాద్, బంధువు పందక జగన్మోహన్, మరో వ్యక్తి బండి కాళికృష్ణలోత కలిసి ఓ వాహనంలో ఏలూరు వైపు వెళ్తున్నారు. మార్గమధ్యంలో మద్యం సేవించేందుకు ఆగారు.
వీరిలో దుర్గాప్రసాద్, జగన్మోహన్ బజ్జీలు తెచ్చేందుకు బయటకు వెళ్లగా మద్యం సేవిస్తున్న పచ్చ మధు (34)ను అతని వెంట ఉన్న బండి కాళికృష్ణ తన వెంట తెచ్చుకున్న నాటు తుపాకితో కాల్చి చంపాడని ఆరోపిస్తున్నారు. ఆ తర్వాత అదే వాహనంలో అతను పరారయ్యాడు. గొడవనే ఈ సంఘటనకు దారి తీసిందనే వాదన అప్పట్లో వినిపించింది.
పచ్చ మధుపై ఏలూరు పోలీసు స్టేషన్లలో ఆరు హత్యా నేరాలు నమోదై ఉన్నాయని డిఎస్పీ సరిత చెప్పారు. కాళికృష్ణ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఏలూరు కోర్టు ఆవరణలో హత్యకు గురైన తాడేపల్లిగూడేనికి చెందిన రౌడీషీటర్ బోయిన రవి కేసులో మధు ముద్దాయి.
బోయిన రవికి అనుచరుడిగా ఉంటూనే అతన్ని మధు కాల్చి చంపాడు. అదే రీతిలో ఇప్పుడు అనుచరుడి చేతిలో మధు హతమయ్యాడు. కాగా, పోలీసులు నల్లజర్ల సెంటర్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండడాన్ని గమనించి కాళికృష్ణ కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. ఎస్పీ రఘురామిరెడ్డి, డిఎస్పీ సరిత సంఘటనా స్థలాన్ని సందర్శించారు.