ఏపీలో ఇంకొన్ని గంటల్లో ఆరంభం కానున్న రాత పరీక్షలు- ఏర్పాట్లు పూర్తి- నిబంధనలు ఇవే
అమరావతి: రాష్ట్రంలో ఆదివారం జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు పర్యవేక్షించారు. రాష్ట్రంలో మొత్తం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు ఈ ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నారు. మొత్తం 5.13 లక్షల మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
కానిస్టేబుళ్ల ఖాళీలను భర్తీ చేయడానికి అవసరమైన ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 997 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి, అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి పోలీస్ నియామక మండలి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలకు వచ్చే అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

అభ్యర్ధులు సమయ పాలన పాటించాల్సి ఉంటుంది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా పరీక్ష కేంద్రానికి వచ్చినా లోనికి అనుమతించరు. ఈ విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలని, నిర్దేశిత గడువు కంటే ముందే పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పరీక్ష కొనసాగుతుంది.
ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమితిస్తారు. పరీక్ష ప్రారంభమైన తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరు. గేట్లను మూసివేస్తారు. అభ్యర్థులు తమ వెంట మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, బ్లూ టూత్, రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రంలోనికి తీసుకెళ్లకూడదు.
వాటినీ కనీసం పరీక్షా కేంద్రం వద్దకు కూడా తీసుకుని రాకూడదని రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. తమ వెంట తెచ్చుకున్న వస్తులను భద్రపరచడానికి పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు అందుబాటులో ఉండవని అన్నారు. హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును సపోర్టింగ్ డాక్యుమెంట్ గా తమ వెంట తీసుకుని వెళ్లాలి.












Click it and Unblock the Notifications