ఏపీలో మళ్లీ ఎన్నికలు - ఎన్నికల సంఘం సమాయత్తం : ఈ నెలలోనే ముహూర్తం..!!
ఏపీలో మరో సారి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పూర్తయిన పంచాయితీ-మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఇక, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికలు పూర్తయినా.. ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికలను రద్దు చేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు పైన ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లింది. అక్కడ ఆ ఆదేశాల పైన స్టే వచ్చంది. కానీ, తుది తీర్పు మాత్రం ఇంకా రాలేదు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టులో విచారణలో ఉంది.

వైసీపీ ఏకపక్ష విజయం..
ఇక, ఇదే సమయంలో తాజాగా ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. మొత్తం 12 కార్పోరేషన్లలోనూ వైసీపీ జెండా ఎగుర వేసింది. మున్సిపాల్టీల్లో రాష్ట్రంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా మిగిలిన అన్నింటా వైసీపీనే విజయం సాధించింది. జెడ్పీటీసీ ఫలితాలను వెల్లడిస్తే అందులోనూ తామే విజయం సాధిస్తామనే ధీమాతో వైసీపీ ఉంది. అయితే, కోర్టు నిర్ణయం కోసం ఏపీ ప్రభుత్వం - ఎన్నికల సంఘం వెయిట్ చేస్తున్నాయి. కోర్టు తీర్పుకు అనుగుణంగా తదుపరి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు సమాయత్తం..
ఇదే సమయంలో ఏపీలో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేసే దిశగా ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లుగా సమాచారం. అందులో భాగంగా.. ఏపీలో రెండు మున్సిపల్ కార్పోరేషన్లతో పాటుగా 11 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వీటికి సాంకేతిక కారణాలతో ఎన్నికలు నిర్వహించ లేదు. ఈ నెలలో వీటికి ఎన్నికలకు వీలుగా నోటిఫికేషన్ విడుదల చేసి..సెప్టెంబర్ లో పోలింగ్ జరిగే విధంగా అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్నికలు జరిగేది ఎక్కడంటే..
అందులో నెల్లూరు..శ్రీకాకుళం కార్పోరేషన్లు ఉన్నాయి. ఇక, ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, బుచ్చిరెడ్డి పాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం, దాచేపల్లి, గురజాల , దర్శి, పెనుకొండ మున్సిపాల్టీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో కుప్పం మున్సిపాల్టీలో ఎన్నికలు వైసీపీకీ-టీడీపీకీ ప్రతిష్ఠాత్మకం కానున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ మెజార్టీ సీట్లు సాధించింది. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంతో అక్కడ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి...విప్ చెవిరెడ్డికి అప్పగించనున్నారు.

జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పుతో..
ఇప్పటికే మున్సిపాల్టీల్లో రెండో డిప్యూటీ మేయర్..డిప్యూటీ వైస్ ఛైర్మన్ల ఎంపిక సైతం పూర్తి చేసారు. దీంతో..ఈ రెండు కార్పోరేషన్లతో పాటుగా 11 మున్సిపాల్టీల్లో వార్డుల రిజర్వేషన్... న్యాయ పరమైన అంశాలు వంటి వాటి పైన అధ్యయనం చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, కరోనా హెచ్చరికలు మరో సారి కీలకంగా మారుతున్నాయి. హైకోర్టు నుంచి జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో వచ్చే తుది తీర్పును చూసిన తరువాత..వీటీ పైన డెసిషన్ తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు భావిస్తున్నట్లుగా సమాచారం.
Recommended Video

న్యాయపరంగా చిక్కులు లేకుండా..
హైకోర్టు జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు అనుమతి ఇస్తే..ఆ తరువాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో..హైకోర్టు లో తీర్పు వచ్చే సమయానికి పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు. కానీ, ఎన్నికల నిర్వహణ లో మాత్రం మరోసారి న్యాయపరమైన చిక్కులు లేకుండా..అన్ని కోణాల్లోనూ పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే నోటిఫికేష్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. గతంలో జరిగిన అనుభవాలను పరిగణలోకి తీసుకొని ఆచి తూచి వ్యవహరిస్తోంది. దీంతో...ఈ నెలాఖరులోగానే ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications