సీఎంను తిట్టినందుకు క్షమించండి - జగన్ ది గొప్ప నిర్ణయం : ఉద్యోగ సంఘ నేతల ప్రశంసలు..!!
ఎట్టకేలకు ఏపీలో ఉద్యోగుల సమ్మె నిలిచింది. ప్రభుత్వం ఉద్యోగ సంఘ నేతలను ఒప్పించింది. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాలు కొంత దిగివచ్చాయి. సుదీర్ఘ చర్చల్లో పరిష్కారం దిశగా రెండు వైపులా ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరిమిస్తున్నట్లుగా ప్రకటించారు. మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో తమ ఆందోళన విరమిస్తున్నట్లుగా వెల్లడించారు. అక్కడే నల్ల బ్యాడ్జీలు తొలిగించారు. దీనికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి జగన్ పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రశంసలు కురిపించారు. కొద్ది రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు.

జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు
సీఎం గొప్ప నిర్ణయాలు తీసుకున్నారంటూ పేర్కొన్నారు. ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వం గుర్తించిందని బండి శ్రీనివాస రావు చెప్పారు.ఉద్యోగులు తమకంటే కూడా సీఎంపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. విజయవాడ సభలో ఉద్యోగులు ఆవేదనతో సీఎంను చిన్న చిన్న మాటలని ఉంటే అన్నదా భావించవద్దని కోరారు. ప్రభుత్వం, ఉద్యోగు లు వేర్వేరు కాదన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా పెద్ద మనుసుతో తమ డిమాండ్లకు అంగీకరించారని చెప్పారు. ఉద్యోగులు, ప్రభుత్వం నడుమ అగ్రిమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉండటం సహజమని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ నేత నేత కేఆర్ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ఏకగీవ్రంగా ఆమోదించామని, సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించి, తన జేబుకు తగిలించుకున్న నల్లబ్యాడ్జీలను తొలగించారు.

ఆ వ్యాఖ్యల పట్ల క్షమాపణలు
చలో విజయవాడ సందర్భంగా సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల క్షమాపణ చెబుతున్నామని.. ఉద్యోగులు ఆవేదనతో మాట్లాడిన మాటలు మనసులో పెట్టుకోవద్దని సచివాలయ సంఘం నేత వెంకటరామి రెడ్డి కోరారు. 5 డీఏలు ఒకేసారి ప్రకటించి సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కు కృతజ్ఞతలు చెప్పారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని కోరామని... ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున, సమ్మె చేయాల్సిన అవసరం లేదని చెబుతూ.. అందుకే విరమించుకున్నామని వెంకట రామి రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా సీఎం, ప్రభుత్వ సలహాదారు సజ్జలపై మేం మాట్లాడాం... వాటిని అన్యదా భావించవద్దని కోరుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు.

గుడ్ డీల్.. సీఎంను కలుస్తాం
ఐఆర్ రికవరీని నిలిపివేస్తామని మంత్రుల కమిటీ చెప్పడం సంతోషం కలిగించిందన్నారు. సమ్మె నోటీసు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. పీఆర్సీ సాధన సమితి సమ్మె విరమించడంపై ఆగ్రహంగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలను కూడా మాతోపాటు సీఎం వద్దకు తీసుకెళ్తామని ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు చెప్పారు. అన్ని సమస్యలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉద్యోగులకు మంచి రోజుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. హెచ్ఆర్ఏ శ్లాబులు అంగీకరించిందని..ఎలాంటి రికవరీలు చేయకుండా నిర్ణయం తీసుకుందని వివరించిన ఆయన ఇది గుడ్డీల్ లా అభివర్ణించారు. తమ బాధ..ఆవేశం పోయాయని చెప్పారు. సీఎంను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతామని చెప్పుకొచ్చారు. దీంతో..ప్రభుత్వానికి భారీ రిలీఫ్ దక్కింది. ఉద్యోగ సంఘాల నేతలు సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటించటంతో పాటుగా.. సీఎం పైన ప్రశంసలు కురిపించటంతో ప్రభుత్వ పెద్దలు సైతం తమ ప్రయత్నాలు సఫలమయ్యాయనే భావనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications