ఏపీకి ఈసారి ఆశల సంక్రాంతి-విపక్షం, ఉద్యోగులు, టాలీవుడ్ ఎదురుచూపులు-అంతా జగన్ దయ
ఏపీలో ఈసారి సంక్రాంతి సీజన్ ఎన్నో ఆశల్ని మోసుకొచ్చింది. రాష్ట్రంలో అన్ని వర్గాల వారూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఉద్యోగులు, టాలీవుడ్, ప్రజలు, విపక్షాలు.. ఇలా ఒక్కరేమిటి.. చాలామందే ఉన్నారు. వీరంతా ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం అయ్యేవారే. దీంతో వీరి ఆశల్ని మోస్తున్న ప్రభుత్వంపై బాధ్యత అంతకంతకూ పెరుగుతోంది. ఇందులో కొన్ని ఆర్ధిక అంశాలైతే, మరికొన్ని రాజకీయ కారణాలతో కూడిన అంశాలూ ఉండటం విశేషం.
రెండున్నరేళ్ల జగన్ సర్కార్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి తాజాగా రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో సంక్షేమాన్ని అందిస్తోంది. దీంతో ఆయా వర్గాల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది.
సంక్షేమంలో అక్కడక్కడా కోతల ఆరోపణలు వినిపిస్తున్నా స్ధూలంగా చూస్తే ప్రభుత్వ సంక్షేమం గాడి తప్పడం లేదు. అప్పులు తెచ్చయినా తమకు సంక్షేమాన్ని ఆపకుండా అమలు చేస్తున్నారన్న పేరును జగన్ సర్కార్ తెచ్చుకుంది. ఇది కచ్చితంగా తొలిసారి ఏర్పడిన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడుతోంది.
ఆర్ధికంగా ఉక్కిరిబిక్కిరి
భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రభుత్వానికి ఆర్ధికంగా ఇబ్బందులు తప్పడం లేదు. అయినా ఏడాదికి దాదాపు లక్ష కోట్లు ఖర్చుపెడుతూ సంక్షేమంలో ఎక్కడా రాజీపడబోమని ప్రభుత్వం బహిరంగంగానే చెబుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమంతో ఖజానా ఖాళీ అవుతున్నా ప్రభుత్వం ఏడాదిలో రెండుసార్లు ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా తీసుకోలేని అర్హులు ఉంటే వారికి కూడా ఇవ్వాలని మరో నిర్ణయం తీసుకుంది.
అదే సమయంలో ఉద్యోగులు, ఇతర వర్గాలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ పడుతోంది. దీంతో ఆ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. ఈ సంక్రాంతి వేళ ప్రభుత్వం ఆయా వర్గాలను కూడా సంతృప్తి పరుస్తుందన్న అంచనాలున్నాయి.
ఉద్యోగుల ఆశలు
ఏపీలో ఉద్యోగులకు గతంలో అమలైన ఏ పీఆర్సీ కన్నా చూసినా తక్కువ పీఆర్సీ ప్రకటించడంతో పాటు తొలిసారి ఐఆర్ కంటే తక్కువ పీఆర్సీ ప్రకటించడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగ సంఘాలు పైకి అంతా బావుందని చెప్తున్నా వారిపై ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంది. అదే సమయంలో ప్రభుత్వం సీఎస్ కమిటీ సిఫార్సుల మేరకు హెచ్ఆర్ఏ కోతలకు సిద్ధమవుతుండటంతో వారిపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. దీంతో వీరంతా జగన్ వైపే చూస్తున్నారు.
టాలీవుడ్ బాధలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అంటీముట్టనట్టుగా ఉండిపోయిన టాలీవుడ్ పెద్దలకు ఇప్పుడు జగన్ తాను కుదురుకున్నాక చుక్కలు చూపిస్తున్నారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ చేయడంతో పాటు వాటి ధరల్ని కూడా ప్రభుత్వం నిర్ణయిస్తోంది. అంతే కాదు లైసెన్స్ లు, ధరలు, నిబంధనలు అంటూ థియేటర్లకు చుక్కలు చూపిస్తోంది. దీంతో టాలీవుడ్ కు చుక్కలు కనిపిస్తున్నాయి. అయితే మధ్యలో చిరంజీవి వంటి కొందరు టాలీవుడ్ పెద్దల జోక్యంతో ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గేందుకు సిద్ధమవుతోంది. తాజాగా చిరంజీవితో సీఎం జగన్ జరిపిన చర్చల తర్వాత కొంత సానుకూలత ఏర్పడింది. ఈ సంక్రాంతి సీజన్ లో జగన్ టాలీవుడ్ కు ఊరటనిచ్చే నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.
పట్టు చిక్కని విపక్షాలు
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా ఏపీ రాజకీయాలపై విపక్షాలకు మాత్రం పట్టు చిక్కడం లేదు. గతంలో ఏ విపక్ష పార్టీలు కూడా ఇంత దారుణమైన పరిస్దితి ఎదుర్కోలేదు. రాష్ట్రంలో భారీ ఎత్తున అమలవుతున్న సంక్షేమం వారి ఆశలపై నీళ్లు జల్లుతుండగా... రాజకీయంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సరైన అజెండా లేక విపక్షం విలవిల్లాడుతోంది. అదే సమయంలో కుప్పం వంటి విపక్ష నేతల కంచుకోటల్ని పెకలించేందుకు జగన్ చేస్తున్న ప్రయత్నాలు వారికి నిద్రలేకుండా చేస్తున్నాయి. జగన్ తమకు ఎక్కడైనా చిన్న అవకాశం ఇవ్వకపోరా అని విపక్షాలు ఎదురుచూస్తున్నాయి.
జగన్ పైనే కోటి ఆశలు
ఈ సంక్రాంతి సీజన్ లో జగన్ తీసుకోబోయే నిర్ణయాలు రాష్ట్రంలో పలు వర్గాలకు కీలకం కానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగులు, టాలీవుడ్, పరిశ్రమలు, విపక్షాలు.. ఇలా చాలా మందిపై ప్రభావం చూపబోతున్నాయి. మూడు రాజధానులపై మరో బిల్లు పెడితే ప్రభుత్వ చిత్తశుద్ది చాటుకోవడం ఖాయం. ఉద్యోగులకు ఆర్ధిక ప్రయోజనాల విషయంలో కాస్త కనికరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఖాయం.
అలాగే సినిమా టికెట్ల ధరలపై నియంత్రణతో కూడిన ఊరట కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. అభివృద్ధి విషయంలోనూ ప్రభుత్వం స్పీడ్ పెంచాల్సి ఉంది. జగన్ తప్పులు చేస్తే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయంగా తిరిగి పట్టు పెంచుకుందామని విపక్షాలు చూస్తున్నాయి. ఇళా ఈ సీజన్ లో జగన్ తీసుకునే నిర్ణయాల కోసం రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎదురుచూస్తున్నట్లే చెప్పుకోవచ్చు.