ఆ మహిళా మావో ఎన్ కౌంటర్ బూటకం...పోలీసుల దారుణాలు:మావోల ఆడియో టేప్ విడుదల
విశాఖపట్టణం:ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఇటీవల జరిగిన పోలీసు ఎన్కౌంటర్పై మావోయిస్టులు స్పందించారు. ఆ ఎన్ కౌంటర్ బూటకమంటూ మావోయిస్ట్ ప్రతినిధి కైలాసం ఈ మేరకు ఒక ఆడియో టేపు విడుదల చేశారు.
ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే మావోయిస్టులను చుట్టుముట్టిన పోలీసులు మీనాను కాల్చిచంపాల్సిన అవసరం లేకపోయినా...కావాలనే అతి సమీపం నుంచి షూట్ చేశారని కైలాసం ఆ ఆడియో టేపులో ఆరోపించారు. పోలీసు కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నా అలా చేయకుండా మళ్లీ మళ్లీ కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారని ఆరోపణలు గుప్పించారు.
మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని కైలాసం పేర్కొన్నారు. ఏవోబీలో గల ఆండ్రాపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లో బీఎస్ఎఫ్, ఎస్ఓజీ బలగాలు గిరిజనులను చిత్రహింసలు పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే వారిపై మావోయిస్టు ముద్ర వేసి నీచంగా ప్రవర్తిస్తున్నాయన్నారు. కటాఫ్ ఏరియాలోని వివిధ మండలాల్లో గిరిజనుల పట్లు ఈ దారుణాలు కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
చివరకు బంధువుల ఇంటికి వచ్చిన గిరిజనులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని కూడా మావోయిస్టులుగా చిత్రీకరించారని, పోలీసుల అరాచకాలను అడ్డుకున్న గిరిజనులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని కైలాసం ఆరోపించారు. పెదబయలులో అరెస్టు చేసిన గిరిజనులను వెంటనే విడుదల చేయాలని కైలాసం డిమాండ్ చేశారు.