End of Naxalism : ఆంధ్రప్రదేశ్లో ముగిసిన ఎర్రజెండా శకం..
దశాబ్దాల కాలంగా ఏజెన్సీ ప్రాంతాలను, అటవీ గ్రామాలను వణికించిన తుపాకీ గొట్టం నేడు నిశ్శబ్దమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మార్చి 31వ తేదీని గడువుగా విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో, రాష్ట్రంలో నక్సలిజం దాదాపు కనుమరుగైపోయింది. నేడు ఆంధ్రప్రదేశ్ ఒక నక్సల్స్ రహిత రాష్ట్రం అని పోలీసులు సగర్వంగా ప్రకటిస్తున్నారు.
లొంగుబాటు బాటలో అగ్రనేతలు..
ఈ విజయయాత్రలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. సుమారు 36 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ, ఉద్యమాన్ని నడిపించిన అగ్రనేతలు సైతం జనజీవన స్రవంతిలోకి రావడం. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి చెల్లూరి నారాయణ రావు అలియాస్ సురేష్ తన అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు. నారాయణ రావు తలపై రూ. 25 లక్షల భారీ రివార్డు ఉందంటేనే ఆయన ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.

ఆయనతో పాటు కర్తం లచ్చు (రూ. 5 లక్షల రివార్డు), పోడియం రాజే, ముచ్చిక మాస, మడవి జోగి, కర్తం అడామే (తలో రూ. 4 లక్షల రివార్డు), మాదివి అడామా, ముచ్చిక లక్ష్మణ్, కడితి హుర్రే (తలో రూ. 1 లక్ష రివార్డు) వంటి ముఖ్య నేతలు లొంగిపోయారు. వీరికి ప్రభుత్వం తక్షణ సహాయంగా ఒక్కొక్కరికి రూ. 20,000 అందజేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు భరోసా కల్పించింది.
పోలీసుల ఉక్కుపాదం..
నక్సలిజం అంతం వెనుక ఏపీ పోలీసుల అలుపెరుగని పోరాటం ఉంది. ఇటీవలి కాలంలో జరిగిన వివిధ ఎదురుకాల్పుల్లో 18 మంది నక్సల్స్ మరణించగా, కృష్ణా, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అల్లర్లు సృష్టించేందుకు మావోయిస్టులు వేసిన కుట్రలను పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఈ ఆపరేషన్లలో 50 మంది దళ సభ్యులను అరెస్టు చేశారు. మొత్తంగా 106 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరి నుంచి 120కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇన్సాస్ రైఫిళ్లు, బి.జి.ఎల్.లు, .303 రైఫిళ్లు, భారీగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. తుపాకీ గొట్టం ద్వారా మార్పు రాదు.. కేవలం అభివృద్ధి , శాంతితోనే ప్రగతి సాధ్యమని నక్సల్స్ గుర్తించాలి. తప్పు తెలుసుకుని వస్తున్న వారికి మేము స్వాగతం పలుకుతున్నామని పోలీస్ ఉన్నతాధికారుల ప్రకటించారు.
భవిష్యత్తు వైపు..
గతంలో అగ్రనేతగా ఉన్న గణపతి వంటి వారు ప్రస్తుతం రాష్ట్రంలో లేరని, ఇతర రాష్ట్రాల విషయాల గురించి మాట్లాడలేమని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పుడు పూర్తి శాంతి నెలకొందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోయిన వారిపై చట్టపరమైన ప్రక్రియ యథావిధిగా జరుగుతుందని, అదే సమయంలో వారి పునరావాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చారు. హింస వల్ల సాధించేదేమీ లేదని, అభివృద్ధి పథంలో భాగస్వామ్యం కావాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు ఇవాళ సత్ఫలితాలను ఇచ్చింది. నక్సలిజం కోరల్లో చిక్కుకుని నలిగిపోయిన మారుమూల గ్రామాల్లో ఇప్పుడు అభివృద్ధి వెలుగులు ప్రసరించనున్నాయి. ఏపీ పోలీసుల తెగువ, కేంద్ర ప్రభుత్వ దృఢ నిశ్చయం కలిసి రాష్ట్రాన్ని నక్సల్స్ ఫ్రీ స్టేట్గా నిలబెట్టాయి.












Click it and Unblock the Notifications