ఆయన లేరని తెలిసి చంద్రబాబు, బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతి: ఎవరీ పరబ్రహ్మ శాస్త్రి
హైదరాబాద్: డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి అనే దాని కన్నా కూడా పీవీ పరబ్రహ్మ శాస్త్రిగా అందరికీ బాగా సుపరిచితం. కవిగా, పురావస్తు పరిశోధకుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. చరిత్రకు సంబంధించి వందలాది శాసనాలను వెలికితీసిన మహనీయుడు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 95 ఏళ్ల వయసులో బుధవారం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. పరబ్రహ్మ శాస్త్రి మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటుగా అభివర్ణించారు.
ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆయన చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. శాతవాహనులు, కాకతీయుల పాలనా విశేషాలు ప్రపంచానికి తెలిశాయంటే, అది ఆయన కృషేనని అన్నారు. ఆయన మరణవార్త విని చరిత్రతో అభిరుచి ఉన్న వారందరూ ముఖ్యంగా శాస్త్రి అధ్యయనాలు తెలిసిన ప్రతీ గుండె దిగ్భ్రాంతి చెందింది.
పరబ్రహ్మ శాస్త్రి మృతి పట్ల సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రచనలు, పరిశోధనల ద్వారా శాతవాహనులు తెలుగువారేనని లోకానికి చాటిన ఆయన మరణం తనకు ఎంతో బాధను కలిగించిందని అన్నారు.
తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా తెలుగు చరిత్రను దశ దిశలా వ్యాపింపజేసిన పరబ్రహ్మశాస్త్రి కుటుంబానికి అండగా నిలుస్తానని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్ర యూనిట్ తరఫున సంతాపం తెలుపుతున్నానని బాలకృష్ణ వివరించారు.
పరబ్రహ్మ శాస్త్రిది గుంటూరు జిల్లా పెద్ద కొండూరు కాగా, తన పూర్వీకులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. శ్రీశైలం, కాకతీయుల, నల్గొండ శాసనాలతో పాటు కాకతీయ ఆలయాల మీద, శాతవాహనుల చరిత్ర మీద పరిశోధనలు చేశారు.
పురావస్తు పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు
ఆధునిక చరిత్రలో ముఖ్యంగా దక్షిణ భారత దేశ చరిత్రలో కాకతీయుల పాలన ఒక అద్వితీయ ఘట్టం. అయితే అప్పటిదాక ఉన్న చారిత్రక ఆధారాల్లో లిఖిత, అలిఖిత ఆధారాల్లో సాహిత్య గ్రంథాలతో పాటు శాసన ఆధారాలు అతి ముఖ్యమైనవి. సాహితీ ఆధారాల్లో ఒక వైపు స్పష్టత ఉన్నా శాసన ఆధారాల్లో స్పష్టత మరింత అనివార్యంగా ఆధారంగా ఈరోజు అందుబాటులో ఉన్నాయి.
పురావస్తు పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు
అలా అందుబాటులో ఉండేందుకు కృషి చేసిన వారిలో పీవీ పరబ్రహ్మ శాస్త్రి ముందు వరసలో ఉంటారని ఆధునిక చరిత్రకారులు తేల్చి చెబుతున్నారు. ఆయన సిద్ధాంత గ్రంథం ది కాకతీయాస్ (కాకతీయులు) ఇప్పటికే కాదు ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
పురావస్తు పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు
కాకతీయ సామ్రాజ్యమంతా కలియతిరిగి ఊరూరా ఉన్న శాసనాలను సేకరించి వాటిని పరిశోధించి వాటిల్లో ఉన్న మూలార్థాన్ని గ్రంథస్తం చేసి బావి తరాలకు అందించిన మహనీయుడు పీవీ పరబ్రహ్మ శాస్త్రి. ఒక అకడమిషన్ చేయవలసిన పనంతా ఒక ఉద్యోగిగా చేసి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీ పరబ్రహ్మ శాస్త్రి రాసుకున్నారు.
పురావస్తు పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు
నిజానికి ఆయన పురావస్తు శాఖలో ఉద్యోగిగా చేరి అక్కడి నుంచి తన ఆసక్తితో శాసనాలను అధ్యయనం చేశారు. పురావస్తు శాఖలో డిప్యూటీ డైరెక్టర్గా పదవీ విరమణ చేశారు. పురావస్తు శాఖలో పనిచేస్తున్న కాలంలోనే 1977లో దార్వాడు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఎస్హెచ్.రిచీ పర్యవేక్షణలో కాకతీయుల మీద పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు.
పురావస్తు పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి ఇకలేరు
బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసి, ఆ తరువాత ఎంఏ ఆర్కియాలజీ చేసి, ఆర్కియాలజీలో ఉద్యోగిగా చేరి కాకతీయుల మీద సాధికారికమైన, సిద్ధాంతపరమైన పరిశోధనలు చేసిన అరుదైన వ్యక్తిగా పీవీ పరబ్రహ్మ శాస్త్రిని చెబుతారు. ఆధునిక దక్షిణ భారత చరిత్రపరిశోధనకు ఆయన చేసిన సేవలకు ఇటీవలే జాతీయ చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్ఆర్) ఆయనకు నేషనల్ ఫెలోషిప్ ప్రకటించింది.