జగన్ లెక్క చంద్రబాబు చేతులెత్తేయలేదు: ఎర్రబెల్లి
హైదరాబాద్: సీమాంధ్రలో పార్టీని కాపాడుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మాదిరిగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై చేతులు ఎత్తేయలేదని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రాంత పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై తాము ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
తెలంగాణ రావడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఇష్టం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాకపోతే తమపై నిందలు వేసి రాజకీయ ప్రయోజనం పొందాలని తెరాస చూపిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రయోజనం కోసం తెరాస, కాంగ్రెసు కుట్ర చేశాయని, తమ పార్టీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన అన్నారు. పేద, వెనకబడి వర్గాలు తమ పార్టీ వెంట ఉన్నాయని ఆయన అన్నారు.

తెలంగాణ ఇవ్వకుండా పదేళ్లు ఏం చేశారని ఆయన కాంగ్రెసు పార్టీని ప్రస్నించారు. రాష్ట్ర విభజనలో తెలంగాణకు కూడా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. తెలంగాణలో ఏర్పడే విద్యుత్తు లోటును ఎలా పూడుస్తారో చెప్పలేదని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. ఆ సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉందని అన్నారు.
ఎన్నికల్లో పొత్తుపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. బిజెపితోనా, తృతీయ కూటమితోనా, సిపిఎంతోనా - ఎవరితో వెళ్లాలనే విషయంపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో తమది జాతీయ పార్టీ అవుతుందని, ఇరు ప్రాంతాలకు సంబంధించి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి తమ పార్టీతోనే సాధ్యమైందని ఆయన అన్నారు. కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందని తెలుగుదేశం తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు రమేష్ రాథోడ్ అన్నారు.












Click it and Unblock the Notifications