బాబును తిట్టడమే పనా: కేసీఆర్కు ఎర్రబెల్లి చురకలు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు ఆదివారం నిప్పులు చెరిగారు. విభజన సమయంలో గవర్నర్ అధికారాలపై చర్చిస్తున్నప్పుడు అడ్డుకోకుండా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
రాజ్నాథ్ సింగ్ ఇంటికి వెళ్లినప్పుడు గవర్నర్ అధికారాలు కేసీఆర్కు గుర్తుకు రాలేదా? అన్నారు. సోనియా ఇంటికి వెళ్లినప్పుడు బిల్లులోని లోపాలు ఆయనకు తెలియవా? అని చురకలు అంటించారు. అప్పుడు బిల్లు పాస్ చేయించుకుని ఇప్పుడు కొత్త నాటకాలు ఏమిటన్నారు.
అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అప్పుడేమో సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడేమో విమర్శలకు దిగుతున్నారన్నారు. మాట తప్పడం, మాట ఇచ్చి మోసం చేయడం కేసీఆర్ నైజమన్నారు. కావాలనే చంద్రబాబును తెరాస టార్గెట్ చేస్తోందన్నారు. కేసీఆర్ తీరువల్ల తెలంగాణ ఎంతో నష్టపోతుందన్నారు.
టీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్కు సంబంధించిన వాస్తవాలను గ్రహించాలన్నారు. కేసీఆర్ రెచ్చగొట్టకుండా ఉంటూ.. ముఖ్యమంత్రిగా సక్సెస్ కావాలని తాను కూడా కోరుకుంటున్నానని చెప్పారు. అయితే, ఆయన తీరు అందుకు భిన్నంగా ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని, చంద్రబాబులను తిట్టడం మాని, ఇచ్చిన హామీలు అమలుపర్చే ప్రయత్నాలు చేయాలన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. చంద్రబాబును తిడితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందా అన్నారు.