పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు : కర్నూల్ ఎమ్మెల్యే
సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ కర్నూలులో ర్యాలీ చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్పై కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన హత్యాచార ఘటనపై పవన్ కల్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్నారని అన్నారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సూచన మేరకే కర్నూలు వచ్చారా? అని పవన్ను ప్రశ్నించిన హఫీజ్.. సుగాలి ప్రీతి కేసులో ఎఫ్ఐఆర్,చార్జిషీట్ వేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని గుర్తుచేశారు. అదే సమయంలో రేణు దేశాయ్ విషయంలో పవన్పై పలు వ్యాఖ్యలు చేశారు.

పవన్ వల్ల రేణు దేశాయ్ ఇబ్బందులు..
బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు జరిగిన ఘటనపై మళ్లీ విచారఱ జరిపిస్తున్నామని, విచారణ కోసం ఓ మహిళా అధికారిణి కూడా ప్రభుత్వం నియమించిందని అన్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఘటనను వైస్ జగన్ ప్రభుత్వంలో జరిగినట్టుగా పవన్ మాట్లాడుతున్నారని హషీజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వల్ల రేణు దేశాయ్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసన్నారు.

ఆ ఇంగీత జ్ఞానం కూడా పవన్కు లేదన్న హఫీజ్
కర్నూలులో జరిగిన సంఘటనపై పవన్ చంద్రబాబును నిలదీయాలన్నారు. హత్యాచారానికి గురైన బాలిక పేరు ప్రస్తావించకూడదన్న ఇంగీత జ్ఞానం కూడా పవన్ కల్యాణ్కు లేదన్నారు. ఇప్పటికే బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో డీజీపీని కలిశామని,పవన్ రోడ్డు మీదకు రాకముందే సీబీఐ విచారణకు పరిశీలించాలని డీజీపీని కోరామని చెప్పారు. బాలిక పేరు చెప్పుకుని పవన్ కల్యాణ్ కర్నూలులో అడుగుపెట్టారని, అర్థం పర్థం లేకుండా మాట్లాడారని విమర్శించారు.అభివృద్ధిని వ్యతిరేకిస్తున్న పవన్కు సీమలో అడుగుపెట్టే అర్హత లేదన్నారు.

పవన్కు నిరసన సెగ..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనతో కర్నూలు నగరంలో ఉద్రిక్త తలెత్తింది. 2017లో అత్యాచారానికి గురై అనుమానాస్పద రీతిలో మరణించిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ బుధవారం (ఫిబ్రవరి 12) ఆయన ర్యాలీ చేపట్టారు. అయితే పవన్ పర్యటనను అడ్డుకునేందుకు రాయలసీమ విద్యార్థి జేఏసీ నేతల ప్రయత్నించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని 'గో బ్యాక్' నినాదాలు చేశారు. దీంతో కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సీబీఐకి అప్పగించాలన్న పవన్..
సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని పవన్ మరోసారి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కర్నూలు నడిబొడ్డున ఉండి.. సీమ నుంచి విజ్ఞప్తి చేస్తున్నానని.. సుగాలి ప్రీతి విషయంలో న్యాయం చేయాలని అన్నారు. లేదంటే వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అనుకోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయాన్ని తాను మానవ హక్కుల సంఘం వరకు తీసుకెళ్తానని అన్నారు. అంతేకాదు,అవసరమైతే ఒకరోజు దీక్ష కూడా చేస్తానన్నారు.సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు ఎన్ని చట్టాలు తెచ్చి ఏం లాభమని ప్రశ్నించారు. వైసీపీ సర్కారు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications