జగన్ కేసుల పై ఉన్నది కేవలం ఆరోపణలే ! టీడీపీ , పవన్కు జలక్ ఇచ్చిన జేడీ !?
Recommended Video
జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ మాజీ జేడా..జనసేన నేత లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ఎనిమదేళ్ల నుండి జగన్ లక్ష కోట్లు కొల్లగొట్టారంటూ చేస్తున్న ప్రచారం రాజకీయ ప్రచారం చేసినట్లుగా ఉందని..తమకు విచారణ సమయంలో అందిన ఆధారాలు 1500 కోట్ల మేర అభియోగాలు నమోదయ్యాయని స్పష్టం చేసారు. దీని ద్వారా ఇప్పటి వరకు టిడిపి..పవన్ చేసిన ప్రచారాన్ని జెడి లక్ష్మీనారాయణ ఖండించినట్లుగా కనిపిస్తోంది.

జగన్ పైన లక్ష కోట్ల ఆరోపణలు..
2009 లో వైయస్సార్ మరణం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో జగన్ సొంత పార్టీ పెట్టారు. ఆ సమయంలో జగన్ పైన అక్రమాస్తులు ఆర్జించారంటూ కాంగ్రెస్ నేత శంకరరావు, టిడిపి నేత ఎర్రంనాయుడు వంటి వారు హైకోర్టులో కేసు దాఖలు చేసారు. ఆ కేసును హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. దీంతో..సిబిఐ జేడీగా ఉన్న లక్ష్మీనారాయణ కేసు విచారణ ప్రారంభించారు. ఆ సమయంలోనే జగన్ను అరెస్ట్ చేసి దాదాపు 16 నెలల పాటు జైళ్లో ఉంచారు. ఇక, జగన్ లక్ష కోట్ల అవినీతి చేసాడంటూ 2014 ఎన్నికల నుండి తాజా ఎన్నికల వరకూ టిడిపితో పాటుగా కాంగ్రెస్ నేతలు..తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సైతం ఆరోపించారు. జగన్ లాగా తండ్రి అధికారం అడ్డుపెట్టుకొని లక్ష కోట్లు తాను సంపాదించలేదని పవన్ పలుమార్లు వ్యాఖ్యానించారు. దీంతో..జగన్ లక్ష కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారే ప్రచారం జోరుగా సాగింది.

లక్ష కోట్లు కాదు..1500 కోట్ల పైనే అభియోగాలు..
అయితే, జగన్ కేసును విచారించిన నాటి సిబిఐ జేడీ..ప్రస్తుత జనసేన నేత లక్ష్మీనారాయణ ఆసక్తి కర విషయాలు బయట పెట్టారు. ఓ టీవి ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ కేసుల వ్యవహారం పైన మాట్లాడుతూ జగన్ లక్ష కోట్ల అవీనితికి పాల్పడ్డారనేది రాజకీయ ఆరోపణలే అని తేల్చి చెప్పారు. జగన్పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తమకు విచారణలో వచ్చిన ఆధారాల మేరకే ఛార్జ్షీట్ వేసామని..అందులో 1500 కోట్లు అభియోగాలు ఉన్నాయని..లక్ష కోట్లయితే కాదని చెప్పుకొచ్చారు. జగన్ పైన ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా చేసే ఆరోపణలకు తాము ఏమీ చేయలేమని తేల్చేసారు. ఆ ఆరోపణలను ఎవరో రాజకీయంగా వాడుకుంటే తాము ఏమీ చేస్తామని ప్రశ్నించారు.

టిడిపి..పవన్ కు షాకింగేనా..
విశాఖ ఎన్నికల ప్రచారంలో పరోక్షంగా జగన్ కేసుల గురించి పవన్ మాట్లాడుతూ లక్ష కోట్లు దోచుకున్న వారిని జెడీ లాంటి వారు ఏ రకంగా వ్యవహరించాలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పుడు జనసేనలో ఉంటూ జగన్ అవినీతి పైన చేసిన వ్యాఖ్యలు టిడిపి..పవన్కు షాకింగ్ అనే విశ్లేషణలు వస్తున్నాయి. అయితే వైసిపి నేతలు మాత్రం జగన్ పైన 1500 కోట్ల మేర అభియోగాలు నమోదైనా..అందులో దాదాపు 800 కోట్ల మేర అభియోగాల్లో జగన్ తప్పు లేదని తేలిందని..మిగిలిన మొత్తం పైన కోర్టులో విచారణ జరుగుతుందని చెబుతున్నారు. ఇక, ఎన్నికల్లో ఎవరికి వారు గెలుపు మాతే అని ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో తాజాగా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications