జగన్ పై బాలినేని సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవచ్చన్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మార్కెట్ యార్డు ఛైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని, రానున్న ఎన్నికల్లో తనకు కూడా టికెట్ రాకపోవచ్చని, తన సతీమణి సచీదేవికి టికెట్ ఇస్తారేమో అన్నారు. నీకు సీటు లేదు.. నీ భార్యకిస్తామని జగన్ అంటే తాను కూడా చేసేది ఏమీ ఉండదని, మహిళలకే ఇస్తామని తేల్చిచెబితే తానైనా పోటీ నుంచి వైదొలగకతప్పదన్నారు.
నియోజకవర్గస్థాయి నేతలంతా విభేదాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం కృషిచేయాలని సూచించారు. వైసీపీ కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వస్తున్నాయని, పార్టీ గెలుపు కోసం అందరితో నడవాల్సిందేనని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ఓటమిపాలైంది.
ఈసారి మాత్రం అక్కడ కచ్చితంగా గెలిచి తీరడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేసుకుంటూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొండెపిలో కచ్చితంగా గెలవాల్సిందేనని, వైసీపీ జెండా ఎగారల్సిందేనని బాలినేని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్న 23 నియోజకవర్గాల్లోను ఈసారి కచ్చితంగా వైసీపీ గెలవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పుడున్న నియోజకవర్గాలతోపాటు అవి కూడా కలుపుకొని, కుప్పంలో చంద్రబాబును ఓడించడంద్వారా మొత్తం 175 నియోజకవర్గాలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
ఆ దిశగా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో కొండెపి, చీరాల, అద్దంకి నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ పరమయ్యాయి. ఇవన్నీ ప్రకాశం జిల్లాలోనివే. దీంతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వీటిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications