ఈడకంటే పక్క రాష్ట్రాల్లో చిన్న యాపారం చేసుకోవచ్చు?
ఏపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఘాటుగా కామెంట్స్ చేశారు. నంద్యాలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో బతకడంకన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవించవచ్చు అనే స్థాయికి ప్రజలను తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ఎన్నో హామీలిచ్చి, మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. ఉద్యోగ హామీ ఇచ్చిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీస నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టి, ప్రాంతాలవారీగా విడదీసి ఒక అంశంపై నుంచి మరో అంశంపైకి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వరకు ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఒక్కటి కూడా చేయలేదన్నారు. పింఛన్లు పెంచుతామని చెప్పి ఉన్న పింఛన్లను పీకేయడంతో వారంతా ఎంతో క్షోభకు గురవుతున్నారన్నారు. వచ్చే నెల 27వ తేదీ నుంచి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు నిరసనగా నారా లోకేష్ చేపట్టే యువగళం పాదయాత్రలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీచేయడానికి అఖిలప్రియ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆళ్లగడ్డతోపాటు నంద్యాల సీటు కూడా తమ కుటుంబానికి ఇవ్వాలంటూ చంద్రబాబు దగ్గర పట్టుపడుతున్నారు. అయితే ఇంతవరకు అఖిలప్రియ సీటుపైనే చంద్రబాబు హామీ ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2019లో ఓటమిపాలైన తర్వాత పార్టీని పట్టించుకోకపోవడం, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయకపోవడంతోపాటు వ్యక్తిగతంగా వివాదాల్లో తలదూర్చిన అఖిలప్రియకు సీటివ్వడానికి చంద్రబాబు సంకోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.