అర్ధరాత్రి దేవినేని ఉమా అరెస్ట్... టీడీపీ-వైసీపీ రాళ్ల దాడులు... జి.కొండూరులో హైడ్రామా,తీవ్ర ఉద్రిక్తత...
మాజీ మంత్రి దేవినేని ఉమాను బుధవారం(జులై 28) అర్ధరాత్రి దాటాక కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు జి.కొండూరు మండలంలో హైడ్రామా,తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ-టీడీపీ కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో ఓ వైసీపీ నేత కారుతో పాటు ఓ టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీనంతటికీ దేవినేని ఉమానే కారణమన్న ఆరోపణలతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముందస్తు ప్లాన్లో భాగంగానే ఈ వివాదానికి తెరలేపారని వారు అనుమానిస్తున్నారు.మరోవైపు దేవినేని ఉమా,టీడీపీ శ్రేణుల వాదన భిన్నంగా ఉంది. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తినే అరెస్ట్ చేస్తారా అని వారు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ వ్రేణులు ఏమంటున్నారు...
జి.కొండూరు మండలంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి వైసీపీ,టీడీపీ భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్థానిక గడ్డమణుగు ప్రాంతంలో జగనన్న కాలనీ నిర్మాణం కోసం పనులు జరుగుతున్నట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇదే అదనుగా అక్కడికి చేరుకున్న దేవినేని ఉమా అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోందని అసత్య ఆరోపణలకు తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమా పిలుపు మేరకే భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారని... వైసీపీ నేతలపై వారు దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.
టీడీపీ శ్రేణుల వాదన...
టీడీపీ శ్రేణులు మాత్రం కొండపల్లి రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపిస్తున్నారు.మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్,ఆయన బంధువులతో కలిసి ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. దీన్ని పరిశీలించేందుకు ఉమా అక్కడికి వెళ్లారని... విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు,ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉమా కారును చుట్టుముట్టి దాడి చేశారని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతల ఫోన్లను సైతం వారు లాక్కున్నారని ఆరోపణలు చేశారు.
అర్ధరాత్రి ఉమా అరెస్ట్...
టీడీపీ,వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం,ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో దేవినేని ఉమాను పోలీసులు అక్కడి నుంచి జి.కొండూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇరు వర్గాల కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి కూడా చేరుకొన్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టినట్లు తెలుస్తోంది. దేవినేని ఉమాను పోలీసులు చాలాసేపు కారు దిగనివ్వలేదు. అయితే తన ఫిర్యాదు స్వీకరిస్తేనే కారు దిగుతానని ఉమా భీష్మించుకుని కూర్చొన్నారు. చివరకు బలవంతంగానే ఆయన్ను కారు నుంచి దించి అర్ధరాత్రి దాటాక 1.15గం. సమయంలో స్టేషన్కు తరలించారు.
Recommended Video
ప్లాన్ ప్రకారమే అల్లర్లు : ఎమ్మెల్యే వసంత్
ప్రశాంతంగా ఉన్న మైలవరంలో పక్కా ప్లాన్ ప్రకారమే దేవినేని ఉమా అల్లర్లు చెలరేగేలా చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. కొండపల్లి ప్రాంతంలోని కొండల్లోకి ఇప్పటికీ 15 సార్లు వెళ్లాడని... పదేపదే అబద్దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జి.కొండూరుకు చెందిన వైసీపీ నేతలపై తన ఉమా అనుచరులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు దేవినేని ఉమా మాట్లాడుతూ... వైసీపీ కార్యకర్తలు తమపై రాళ్లు రువ్వారని ఆరోపించారు. తనపై దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కొండపల్లి అటవీ ప్రాంతంలో లక్షల రూపాయల విలువైన గ్రావెల్ దోపిడీ జరిగిందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు.