'వైసీపీ తరపున బాబుకు సన్మానం', 'రాజకీయ వ్యాపారం చేస్తున్న బాబు'
రాజమండ్రి: ఏపీ సీఎం చంద్రబాబుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎత్తిపోతలతో నదులను అనుసంధానం చేస్తామంటూ సీఎం చంద్రాబాబు, మంత్రి దేవినేని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఆగస్టు 15లోగా గోదావరి నుంచి కృష్ణా నదికి లీటర్ నీటిని తరలించినా వైయస్ఆర్ కాంగ్రెస్ తరుపున సీఎం చంద్రబాబుకు సన్మానం చేస్తామని అన్నారు.
రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు: బొత్స
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం లేదని, రాజకీయ వ్యాపారం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఏపీలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దోచుకుని దాచుకోవాడనికే అనే విధంగా ప్రభుత్వ పాలన ఉందన్నారు.
మొన్న జరిగిన ఎమ్మార్వో దాడి ఘటనలో ప్రభుత్వం ఎమ్మెల్యేకు అండగా నిలబడమేనని అన్నారు. సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రాజధాని సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని చెబుతున్న బాబు, సింగపూర్లో ఉన్న వారి భాగస్వాములను వ్యాపారం చేయడానికే తీసుకువచ్చారని ఆరోపించారు. దీనిపై మరిన్ని ఆధారాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.