ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్పై మాజీ మంత్రి వెల్లంపల్లి సంచలన వ్యాఖ్యలు
పనికిమాలిన ఎంపీ మాటలు, పకోడి రామకృష్ణ మాటలను ప్రజలెవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సొంత పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్పై విమర్శనాత్మక దాడి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. తిరుమల వెళ్లిన ఎంపీ శ్రీధర్ నిన్న బీజేపీకి వైసీపీ మూడు సంవత్సరాల నుంచి మద్దతిస్తోందని, అందులో దాపరికం ఏం ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
దీనిపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి ఎంపీ శ్రీధర్ వ్యాఖ్యలపై ఫైరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసుకోవడానికి, ఆర్థికంగా సహకారం అందించుకోవడానికి పరస్పరం సహకరించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ఈనెల 8, 9 తేదీల్లో జరిగే ప్లీనరీలో పోలవరంపై ఈ మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రదర్శన ఉంటుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేస్తారని, మిగతా సమయాల్లో ప్రజల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిస్తారన్నారు.
తిరుమలలో ఉన్న వాస్తవాన్ని మాట్లాడిన కోటగిరి శ్రీధర్పై వెల్లంపల్లి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న విషయాన్ని కోటగిరి మాట్లాడారని, పోలవరం పూర్తిచేసేందుకు ఆర్థికంగా సహాయాన్ని కోరుతున్నామని చెప్పారని, ఇందులో వెల్లంపల్లి.. శ్రీధర్పై మాటల దాడిచేయాల్సిన అవసరం ఏముందని ఆ పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తిరిగి వెళ్లే సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఒక మెమొరాండం సమర్పించారు. ప్రత్యేక హోదాతోపాటు పోలవరం పూర్తిచేయడానికి సాయం అందించాలని అందులో కోరారు. ఇప్పుడు దీనిపై వైసీపీ నేతలమధ్యే యుద్ధం నడుస్తోంది.