చీకట్లో గుళ్ళు కూల్చి.. ఇప్పుడు దేవుడి పేరుతో రాజకీయాలా?: మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక చవితి మండపాలకు వైసీపీ ప్రభుత్వం విపరీతమైన ఆంక్షలు పెడుతోందని తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన పార్టీలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా మండపానికి అనుమతి కావాలంటే న్యాయవాది నోటరీ కావాలన్న నిబంధన, ప్రతి మండపం వద్ద నీరు, ఇసుక ఉండాలని కొత్త నిబంధనలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వినాయక చవితి సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Recommended Video

వినాయక చవితికి ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు: వెల్లంపల్లి
వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదని పేర్కొన్న ఆయన, గణేష్ మండపాల అనుమతి సులభతరం చేశామని వెల్లడించారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా గతంలో అగ్నిమాపక, పోలీస్, విద్యుత్ శాఖ , మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి కోసం వేరువేరుగా దరఖాస్తు చేయాల్సి వచ్చేదని, కానీ వైసిపి హయాంలో సింగిల్ విండో విధానాన్ని తీసుకు వచ్చామని పేర్కొన్నారు. గణేష్ మండపాల రుసుము ఒక్క రూపాయి కూడా పెంచలేదని, గత ప్రభుత్వ నిబంధనలనే తాము కూడా అమలు చేస్తున్నామని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది
ప్రతిపక్ష పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో 250 వాట్ల విద్యుత్ ను వినియోగిస్తే వెయ్యి రూపాయల వరకు చెల్లించాల్సి వచ్చేది అని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దాన్ని 500 రూపాయలకు తగ్గించామని వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. వినాయక చవితి పై ప్రభుత్వ నిబంధనలు విధించింది అని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి,అధికారులు, డిజిపితో సహా అనేకమార్లు వివరణ ఇచ్చినప్పటికీ సోము వీర్రాజు, టిడిపి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

చీకట్లో దేవాలయాలను కూల్చిన వారు దేవుడి గురించి మాట్లాడతారా?
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పుట్టగతులుండవని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. చీకట్లో దేవాలయాలను ధ్వంసం చేసిన నీచమైన చరిత్ర టిడిపి, బిజెపి, జనసేన మిత్రపక్షాలదని ఆయన విమర్శించారు. టీడీపీ ఆఫీసు స్క్రిప్ట్ ను సోము వీర్రాజు, ఇతర బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. అసలు తెలుగుదేశం పార్టీకి దేవుడు గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ఆలయాలను కూల్చి, విగ్రహాలను ధ్వంసం చేసి, రథాలను తగలబెట్టే వారు దేవుడు గురించి ఎలా మాట్లాడుతారు అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications