జనసేనలో మరో వికెట్: గుడ్ బై చెప్పి పవన్కు మరో నేత రాజీనామా లేఖ
విశాఖపట్నం: జనసేన పార్టీలో వలసల పర్వానికి తెర పడట్లేదు. మొన్నటికి మొన్నే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన మరో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య గుడ్ బై చెప్పారు. అనుచరుల కోరిక మేరకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపించారు. తాను గాజువాకలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నానని కుండబద్దలు కొట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజల నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని, సొంత నియోజకవర్గాన్ని వదులుకోలేనని వెల్లడించారు.
పెందుర్తి నుంచి పోటీ చేసి.. ఓటమి
మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పెందుర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి బండారు సత్యనారాయణ మూర్తి విజయం సాధించగా.. తెలుగుదేశానికి చెందిన ఆదీప్ రాజ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. 2009-2014 మధ్యకాలంలో వెంకట్రామయ్య గాజువాక ఎమ్మెల్యేగా కొనసాగారు. మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలుపొందారు. గాజువాకతో 15 ఏళ్లుగా ఆయనకు అనుబంధం ఉంది. భవిష్యత్ లో కూడా రాజకీయంగా గాజువాక నియోజకవర్గంలో మాత్రమే ఉండాలని కార్యకర్తల, శ్రేయోభిలాషుల కోరిక మేరకు జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నానని వెంకట్రామయ్య తెలిపారు.
గంటా శ్రీనివాస్ కు ఆప్తుడిగా..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుకు ఆప్తుడిగా వెంకట్రామయ్యకు పేరుంది. జిల్లాకే చెందిన పర్యాటక శాఖ మంత్రి అవంతీ శ్రీనివాస్, గంటా శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య.. వీరిదంతా ఓ బ్యాచ్. రాష్ట్ర విభజన తరువాత వారంతా తెలుగుదేశంలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ లకు మాత్రమే టికెట్ ఇచ్చింది. దీనితో చింతలపూడి పార్టీ ఫిరాయించారు. జనసేన పార్టీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో పెందుర్తి నుంచి పోటీ చేసి, ఓటమి పాలయ్యారు. పెందుర్తి నియోజకవర్గంపై పట్టు లేకపోయినప్పటికీ తనను బలవంతంగా పంపించారనే భావన ఆయనలో వ్యక్తమైంది.
పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం..
అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి- ఆ స్థానం చింతలపూడి వెంకట్రామయ్యది. గాజువాక నుంచే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడంతో ఆయన కోసం తన సీటును వదులుకున్నారు. పెద్దగా పట్టులేని పెందుర్తి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. చేదు ఫలితాన్ని చవి చూశారు. అప్పటి నుంచీ జనసేన పార్టీలో పెద్దగా క్రియాశీలకంగా లేరు. అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చారు. పవన్ కల్యాణ్ సైతం ఓడిపోవడంతో ఇక పార్టీలో కొనసాగదలచుకోలేదంటూ ఇదివరకే ఒకట్రెండు సార్లు ఆయన సంకేతాలు సైతం ఇచ్చారు.
బీజేపీనా.. వైసీపీనా
రాజీనామా చేసిన నేపథ్యంలో ఇక జిల్లాలో అందరి దృష్టీ వెంకట్రామయ్యపై పడింది. గాజువాక నియోజకవర్గంలోనే కొనసాగుతానంటూ చింతలపూడి కుండబద్దలు కొట్టిన నేపథ్యంలో.. ఆయన తన సొంత స్థానానికి రావడం ఖాయమైనట్టే. ఏ పార్టీలో చేరుతారనేది ఆసక్తికరంగా మారింది. గాజువాక నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్సార్సీపీ చేతిలో ఉంది. పవన్ కల్యాణ్ ను సైతం ఓడించిన జెయింట్ కిల్లర్ గా తిప్పల నాగిరెడ్డి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని కాదని చింతలపూడి వెంకట్రామయ్యకు పట్టం కడుతుందని ఎవరూ అనుకోవట్లేదు. ఆయన మిత్రుడు అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఇక గంటా శ్రీనివాస్ కూడా అదే పార్టీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో చింతలపూడి కూడా వైసీపీలో చేరొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరోవంక- బీజేపీ నుంచి కూడా ఆయనకు పిలుపు అందినట్లు తెలుస్తోంది. చింతలపూడి తమ పార్టీలో చేరితే గాజువాక సీటు ఖాయమంటూ కమలనాథులు ఆయనకు సమాచారం ఇచ్చారని చెబుతున్నారు.