అందరి టార్గెట్ బాబు, వారిది అనుమానపు కాపురం, కెసిఆర్ ఫ్రంట్ వెనుక...: దాడి వీరభద్రరావు
విశాఖ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చివరి నిమిషంలో పోరాటం చేస్తే ప్రయోజనం ఏముంటుందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. నాలుగేళ్ళ పాటు టిడిపి, బిజెపిలు అనుమాన కాపురం చేశాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2014 ఎన్నికలకు ముందు టిడిపి నుండి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు 2014 ఎన్నికల తర్వాత వైసీపీ నుండి కూడ బయటకు వచ్చారు.ఇటీవల కాలంలో ఆయన తిరిగి టిడిపిలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం కూడ సాగింది.
ఈ తరుణంలో రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిస్థితులపై ఓ తెలుగు న్యూస్ ఛానెల్ దాడి వీరభద్రరావును ఇంటర్వ్యూ చేసింది. రాష్ట్రరాజకీయ పరిస్థితులపై దాడి వీరభ్రదరావు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
4 ఏళ్ళు టిడిపి, బిజెపి అనుమానపు కాపురం
4 ఏళ్ళపాటు బిజెపి, టిడిపి మధ్య మిత్రత్వం అనుమానపు కాపురం మాదిరిగానే సాగిందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చెప్పారు. ప్రధానమంత్రి మోడీపై బాబుకు నమ్మకం లేదు, బాబుపై మోడీకి నమ్మకం లేకుండా పోయిందన్నారు.ఈ అపనమ్మకంతోనే నాలుగేళ్ళపాటు ఈ రెండు పార్టీలు మిత్రపక్షాలుగా కొనసాగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక హోదాపై 2 ఏళ్ళ క్రితమే పోరాటం చేయాలి
ప్రత్యేక హోదాపై 2 ఏళ్ళ క్రితమే పోరాటం చేస్తే ప్రయోజనం ఉండేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విషయంలో చివరి నిమిషంలో పోరాటం చేయడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. ఎన్నికలు ఏడాదిలోపుగా వచ్చే అవకాశం ఉందన్నారు.. రాజకీయ ప్రయోజనం ఆశిస్తే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తే బిజెపికి ప్రయోజనంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ, బిజెపి ఆ దిశగా కూడ ఆలోచించడం లేదన్నారు.
కెసిఆర్ ఫ్రంట్ వెనుక మోడీ ఉన్నారేమో
తెలంగాణ సీఎం కెసిఆర్ కాంగ్రెస్, బిజెపియేతర పార్టీలను కూడగట్టి మూడవ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తారనే అనుమానంతో తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో మూడో ఫ్రంట్ వెనుక బిజెపి ఉందో లేక ఇతరులున్నారోననే అనుమానాన్ని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వ్యక్తం చేశారు. కెసిఆర్ కూటమి ప్రయత్నం వెనుక ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అందరి లక్ష్యం చంద్రబాబు
ప్రస్తుతం అందరి లక్ష్యం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుగా మారాడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడుకు ఇది కీలకమైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రంపై సబ్జెక్టుల వారీగా రెండేళ్ళ నుండే టిడిపి నేతలు నిలదీస్తే రాష్ట్రానికి నిధుల విషయంలో కొంత ప్రయోజనం దక్కేదని ఆయన అభిప్రాయపడ్డారు.
జైట్లీ బిజెపికి శకుని
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఆర్థిక శాఖ మంత్రి అరుణ్జైట్లీ శకుని లాంటి వాడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు.రక్షణ శాఖ నిధులను ఏపీ ప్రభుత్వం అడిగినట్టుగా ఆర్థిక మంత్రి జైట్లీ చెప్పడంపై దాడి వీరభద్రరావు మండిపడ్డారు. జైట్లీ వ్యాఖ్యలు ఏపీ ప్రజలను మానసికంగా గాయపర్చాయన్నారు.