ఉచిత బస్సెందుకు ? వెంకయ్య ప్రశ్న-పథకాలు, అప్పులపైనా ఫైర్....!
ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో అమలవుతున్న మహిళలకు ఉచిత బస్సు పథకంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ఉచితాల కోసం భారీగా ప్రభుత్వాలు అప్పులు చేయడాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు విద్య, వైద్యంపై డబ్బులు ఖర్చుపెట్టాలని సూచించారు. మరోవైపు అసెంబ్లీలో బూతులు తిట్టుకునే సంప్రదాయానికి తెర వేయాలని రాజకీయ పార్టీల్ని కోరారు.
విచ్చలవిడిగా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతున్న ప్రభుత్వాలు, వాటి కోసం తిరిగి అప్పులు చేయాల్సి రావడాన్ని వెంకయ్య నాయుడు తప్పుబట్టారు. ప్రభుత్వాలే ఉచిత పథకాలు ఇస్తుంటే వాటిని ప్రజలు తీసుకోవడంలో తప్పులేదన్నారు. ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని కోరారు. ఎవరూ ఉచిత పథకాలు వద్దని చెప్పరన్న వెంకయ్య.. చేపలు పట్టించడం నేర్పించాలి కానీ చేపలు తెచ్చి ఉచితంగా ఇవ్వకూడదంటూ ప్రభుత్వాలకు చురకలు అంటించారు.

ప్రస్తుతం ఉచిత పథకాలు పరిమితులు దాటిపోయాయని, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని అమలు చేయడం అలవాటుగా మారిపోయిందని వెంకయ్య తీవ్రంగా ఆక్షేపించారు. వీటి వల్ల భారీగా అప్పులు చేస్తుంటే రాష్ట్ర అభివృద్ధి ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రంలో అప్పులపై శ్వేతపత్రం ప్రకటించాలని ప్రభుత్వానికి వెంకయ్య సూచించారు. అలాగే ఉచిత బస్సు పథకం వల్ల ప్రయోజనం ఏంటన్నారు. దీన్ని అమలు చేస్తున్న ఏపీ, తెలంగాణ, కర్నాటకల్ని ప్రశ్నించారు.
అలాగే ప్రజా ప్రతినిధులు పార్టీలు ఫిరాయించినప్పుడు సొంత పార్టీలకు రాజీనామా చేయాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఈ మేరకు రాజ్యాంగాన్ని కూడా సవరించాలన్నారు. పార్టీలు ఫిరాయించి మంత్రులు అయిపోతున్నారని ఆక్షేపించారు. మరోవైపు చట్టసభల్లో ప్రజాప్రతినిధుల బూతు పురాణాల్ని కూడా వెంకయ్య తప్పుబట్టారు. ఇలా బూతులు మాట్లాడేవాళ్లపై చట్ట సభలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో త్వరగా విచారణ పూర్తి చేసి శిక్షలు విధించాలని కూడా కోరారు. రాజకీయ వారసత్వాలకు తాను వ్యతిరేకం కాబట్టే కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురాలేదన్నారు.












Click it and Unblock the Notifications