తెలుగునాట రాజకీయ సంచలనానికి 40 ఏళ్లు
పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా 40 సంవత్సరాల క్రితం 1983 ఇదే జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారకరామారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం సంచలనానికి దారితీసింది. 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో సామాన్యుడి ఘోషను పట్టించుకునేవారే కరవయ్యారు. అలాంటి పరిస్థితుల్లో తెలుగువాడి ఆత్మగౌరవమే ధ్యేయంగా, రాజకీయాల్లో నూతన మార్పే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది.

రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన
పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేశారు. ఆయన ఫలాన ఊరు వస్తున్నారంటే షెడ్యూల్ ఆలస్యమైనా 24 గంటలపాటు ఆయన వచ్చేవరకు ఎదురుచూసిన గ్రామాలు, పట్టణాలు ఎన్నో. గెలుపొందిన సంచలనమేకాదు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వేసిన ప్రతి అడుగు సంచలనమైంది. ప్రపంచంలో ఏ పార్టీ కూడా ఏర్పడిన 9 నెలల్లో అధికారం చేపట్టలేదు.

ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఎన్టీఆర్ తన విలక్షణతను చాటారు. అప్పటి వరకు రాజ్ భవన్ లో కొద్దిమంది ఆహుతుల మధ్య ప్రమాణ స్వీకారం చేసే పద్దతిని పక్కన పెట్టారు. తమను ఎంతగానో ఆదరించి, గుండెల్లో గుడికట్టిన అభిమానుల సమక్షంలో లాల్ బహుదూర్ స్టేడియంలో ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. అక్కడి నుంచి బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తూ, వారి సంక్షేమం కోసం టీడీపీ పాలన సాగించింది. అదే సమయంలో విప్లవాత్మక నిర్ణయాలు కూడా తీసుకున్నారు.

టీడీపీ తీసుకొచ్చిన సంస్కరణలు
మునసబు, కరణాల వ్యవస్థను, తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు.
వృత్తి విద్యా కళాశాలల్లో సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు.
ఇంజనీరింగ్, మెడిసన్ కోసం ఎంసెట్ తెచ్చారు.
కంప్యూటర్ల వినియోగదాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ వైద్యులు ప్రయివేటు ప్రాక్టీసు చేయడాన్ని నిషేధించారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. దేశంలో అలాంటి చట్టం చేసిన ఏకైక రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ చట్టం తెచ్చిన 20 సంవత్సరాల తర్వాత కేంద్రం కూడా ఇలాంటి చట్టమే తీసుకొచ్చింది.
ఎస్సీలకు ఒక శాతం, ఎస్టీలకు 2 శాతం రిజర్వేషన్లు పెంచారు.
విద్య, ఉద్యోగాల్లో 30 మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోను వీటిని వర్తింప చేశారు.
అధికార వికేంద్రీకరణ ద్వారా తాలూకాలు, రెవెన్యూ మండలాలు, మండల పరిషత్ లు ఏర్పాటు చేశారు.
మొదటిసారిగా జిల్లా పరిషత్ లు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు మొదటిసారిగా ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications