'కేబీఆర్' ఫైరింగ్ పక్కా ప్రణాళిక, కిడ్నాప్ యత్నమా?
హైదరాబాద్: వీవీఐపీలు మార్నింగ్ వాక్ చేసే కేబీఆర్ పార్కులో బుధవారం ఉదయం కాల్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దీని పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. అగంతకుడు ఎందుకు వచ్చాడు? ఎందుకు కాల్పులు జరిపాడు? అనే కోణాల పైన పోలీసులు ఆరా తీస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే ఈ కాల్పులు జరిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిత్యానందను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేశాడా అనే కోణంలోను దర్యాఫ్తు చేస్తున్నారు.
అగంతకుడు ఏకే 47తో జరిపిన కాల్పుల్లో బుల్లెట్లు కారు అద్దాలతో పాటు భూమిలోకి దూసుకు పోయాయి. కాల్పులు జరిగిన విషయం తెలియగానే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం రంగంలోకి దిగింది. ఆధారాలను సేకరిస్తున్నారు. నిత్యానంద రెడ్డి నుండి, ఆయన సోదరుడి నుండి వివరాలు తీసుకున్నారు.
పాత గొడవలా.. పూర్తి సమాచారం తెలిసిన వ్యక్తే
నిత్యానంద రెడ్డి పైన కాల్పులకు పూర్తిగా తెలిసిన వ్యక్తే కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. వ్యాపార గొడవలా? పాత గొడవలు ఉన్నాయా? లేక ఇంకేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే, వీవీఐపీ జోన్లో కాల్పులు జరపడంపై అందరం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, అగంతకుడు నాలుగు రౌండ్లకు పైగా నిత్యానంద రెడ్డి పైన కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నిత్యానందకు, ఆయన సోదరుడికి ఎలాంటి గాయాలు కాలేదు. అగంతకుడు లుంగీ కట్టుకొని వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏకే 47తో కాల్పులు జరిపాడు. షాక్కు గురైన నిత్యానంద కాసేపటికి తేరుకొని ఎదురు కాల్పులు జరిపాడు. నిత్యానంద కారు వద్దకు వచ్చాక, అగంతకుడు వచ్చాడు. అడిగే క్రమంలో కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.
అగంతకుడిని పట్టుకునే ప్రయత్నం..
అగంతకుడిని నిత్యానంద రెడ్డి, ఆయన సోదరుడు కలిసి పట్టుకునే ప్రయత్నం చేశారు. వీరికి మధ్య కాసేపు పెనుగులాట కూడా జరిగింది. కాని అంతలోనే ముసుగు ధరించిన వ్యక్తి రోడ్డు దాటి పారిపోయాడు.
సోదరుడి రాకతో..
నిత్యానంద రెడ్డి.. తన సోదరుడు ప్రసాద రెడ్డి కారణంగానే బతికి బట్ట కట్టారంటున్నారు. సోదరుడితో కలిసి నిత్యానంద రెడ్డి పార్కుకు వచ్చారు. మార్నింగ్ వాక్ ముగిసిన అనంతరం ఇంటకెళ్లే క్రమంలో నిత్యానంద రెడ్డి కారులో కూర్చోగానే.. ఆగంతకుడు బలవంతంగా కారులోని వెనుక సీట్లోకి ప్రవేశించి, కాల్పులు జరిపాడుత.
అయితే ఊహించని పరిణామానికి ఏమాత్రం భయపడని నిత్యానంద రెడ్డి, ఆగంతకుడి చేతిలోని తుపాకిని పట్టేశాడు. అయినా, అతడు నిత్యానంద రెడ్డి పైకి దుండగుడు పలు రౌండ్ల మేర కాల్పులు జరిపాడు. సమీపంలోనే ఉన్న సోదరుడు ప్రసాద రెడ్డి దీనిని గమనించి పరుగున అక్కడికి వచ్చి అగంతకుడిని వెనుక నుంచి గట్టిగా పట్టేశాడు.
దీంతో అగంతకుడు పారిపోయాడు. అశోకా బిల్డర్స్ భవనం వైపు పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ప్రసాద రెడ్డి తనను పట్టుకోగానే ఆగంతకుడు తనను తాను రక్షించుకునేందుకు తుపాకిని వదిలేసి పరాపోయాడు.