పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఏం చేయబోతున్నారు?
జీవో నెంబరు 1కి సంబంధించి హైకోర్టులో విచారణ జరగుతుండగానే సుప్రీంకోర్టులో విచారణ జరపడం భావ్యం కాదని భావించిన ధర్మాసనం బంతిని హైకోర్టులోకే నెట్టింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈనెల 26వ తేదీ నుంచి చేపట్టబోతున్న వారాహి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న యువగళం కొనసాగుతాయా? లేదా? అనే ఉత్కంఠ ఏపీలో నెలకొంది.

రవాణాశాఖ అనుమతి కోసం నిరీక్షణ
వారాహి తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారు. ప్రత్యేకంగా తయారుచేయించిన వాహం కాబట్టి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి. ఏపీ రవాణాశాఖ నుంచి ఇంతవరకు అనుమతులు తీసుకోలేదు. దానికి సంబంధించిన వ్యవహారమే కార్యాలయంలో నడుస్తోంది. వారాహికి ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయా? రావా? అనే చర్చ రాష్ట్రంలో నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోను యాత్రను ప్రారంభించాలనే పట్టుదలలో జనసేనాని పవన్ కల్యాణ్ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఎదురైనా ఆయన యాత్రను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పోలీసులకు లేఖ రాసినా..
జనవరి 27వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న యువగళంకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు కొనసాగనుంది. అయితే లోకేష్ యాత్ర సజావుగా సాగుతుందా? పోలీసులు అనుమతిస్తారా? అనేది ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారింది. జీవో నెంబరు 1 ద్వారా రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదు. దీంతో పోలీసుల నుంచి ఆంక్షలు ఎదురవుతున్నాయి. పాదయాత్రకు అనుమతి తీసుకునేందుకు టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాశారు. చిత్తూరు ఎస్పీకి, ఇతర పోలీసు అధికారులకు కూడా లేఖ రాశారు. అయితే వారి నుంచి ఇంతవరకు స్పందన రాలేదని వర్ల చెప్పారు.

కోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు?
డీజీపీకి దీనిపైనే మరో లేఖను పంపించారు. పాదయాత్ర అనుకున్న సమయానికి అనుకున్న విధంగానే మొదలవుతుందని, కుప్పంలో సభ కూడా ఉంటుందని వర్ల రామయ్య చెబుతున్నారు. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటారా? అనే ఉత్కంఠ నెలకొంది. యువగళం సజావుగా సాగుతుందా? అడ్డంకులు ఏర్పడతాయా? అనేదాంట్లో స్పష్టత లేదు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టుకే నిర్ణయాన్ని వదిలేయడంతో పవన్ కల్యాణ్, నారా లోకేష్ కోర్టు నుంచి ప్రత్యేక అనుమతులు తెచ్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications