జగన్ది అత్యుత్సాహమేనా?: బిజెపి-హోదాపై అక్కడే మెలిక.. ప్లీనరీలో ఏం చెప్తారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి తొలిసారి అమరావతిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఏం చేస్తారు? కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై భరోసా ఇస్తారా?
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరి తొలిసారి అమరావతిలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ ఏం చేస్తారు? కార్యకర్తలకు వచ్చే ఎన్నికల్లో గెలుపుపై భరోసా ఇస్తారా?
చదవండి: ప్రశాంత్ కిషోర్-జగన్ మధ్య డీల్ ఎంత?: ఎమ్మెల్యేల జాతకాలు మొదలు..
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు పాదయాత్రను ప్రకటిస్తారా? ప్రశాంత్ కిషోర్ కొందరు ఎమ్మెల్యేలపై ఇచ్చిన నెగిటివ్ రిపోర్ట్ విషయమై జగన్ ఏం చేస్తారు? అనే అంశాలపై చర్చ సాగుతోంది.
కోవింద్ విషయంలో జగన్ అత్యుత్సాహం ప్రదర్శించారా?
ఇటీవల బిజెపికి దగ్గరయ్యేందుకు వైయస్ జగన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అభ్యర్థిని ప్రకటించకముందే ఎన్డీయేకి మద్దతిస్తామని జగన్ ప్రకటించడం అత్యుత్సాహం అనే విమర్శలు వచ్చాయి. హైదరాబాద్ వచ్చిన రామ్నాథ్ కోవింద్ కాళ్లు మొక్కి మరోసారి అత్యుత్సాహం ప్రదర్శించారని అంటున్నారు. మొత్తానికి బిజెపికి దగ్గరయ్యేందుకు ఆయన తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. దీంతో బిజెపి విషయంలో ప్లీనరీలో జగన్ ఏమైనా చెబుతారా అనే చర్చ సాగుతోంది.
Recommended Video
ప్రత్యేక హోదాను వదిలేసినట్లేనా? అక్కడే ట్విస్ట్..
వైయస్ జగన్ ప్రత్యేక హోదాను వదిలేసినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. గతంలో హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జగన్.. ఆ తర్వాత ఇవాళ కాకుంటే రేపు చేస్తామని చెప్పారు. కానీ ఆ వ్యాఖ్యల వెనుక దాదాపు హోదా వదిలేసినట్లే అర్థం అంటున్నారు. అయితే ఇక్కడో విషయం ఉంది. 2019 నాటికి బిజెపికి దగ్గరయ్యే పరిస్థితి ఉంటే హోదా అంశాన్ని జగన్ వదిలేసినట్లేనని, దగ్గరయ్యే పరిస్థితి లేకుంటే మాత్రం హోదా అంశాన్ని వచ్చే ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా చేస్తారని అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ సూచన ఏం చేస్తారు? కేసుల వల్ల పాదయాత్ర మాటేమిటి
వచ్చే ఎన్నికల్లో వైసిపి గెలుపు కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేశారని, పలువురిపై వ్యతిరేకత ఉందని తేలిందని వార్తలు వచ్చాయి. దీంతో ఆ ఎమ్మెల్యేలు ప్రశాంత్ కిషోర్, జగన్ తీరులపై అసంతృప్తితో ఉన్నారట. అదే సమయంలో ప్రజలను నేరుగా కలవాలని, అందుకోసం పాదయాత్ర చేయాలని జగన్కు ప్రశాంత్ సూచించారని అంటున్నారు. పాదయాత్రపై ప్లీనరీ వేదికగా జగన్ ఏదైనా ప్రకటన చేయనున్నారా తేలనుందని అంటున్నారు. అలాగే కేసుల వల్ల పాదయాత్ర సాధ్యమవుతుందా అనేది అనుమానమే అంటున్నారు.
ప్రశాంత్ కిషోర్ సర్వేలో వ్యతిరేక పవనాలు.. ఆందోళన తగ్గిస్తారా
ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో వైసిపికి వ్యతిరేక పవనాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన కొట్టి పారేసినప్పటికీ.. ఇలాంటి ప్రచారాలపై వైసిపి ఏమైనా ప్రకటన చేస్తుందా చూడాలంటున్నారు. మరోవైపు, ప్రశాంత్ కిషోర్ సర్వే చేసింది నిజమేనని, వైసిపికి అనుకూలంగా లేదని తేలిందని కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేడర్లో ఉన్న ఆందోళనను తగ్గించే ప్రయత్నాలు చేస్తారా తేలాల్సి ఉందని అంటున్నారు.
భరోసా ఇస్తారా.. ఇంచార్జులకు షాకిస్తే..?
2014 గెలుస్తామనుకున్నారు. కానీ ఓడిపోయారు. ఆ తర్వాత పలువురు నేతలు టిడిపిలో చేరారు. దీంతో వైసిపిలో ఒకింత నిరుత్సాహం కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జులను ప్రకటించి.. జగన్ టిడిపికి ధీటుగా సమాధానం చెప్పారు. నంద్యాలలో ఏ భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత రాజగోపాల్ రెడ్డిని ఇంచార్జిగా ప్రకటించారు. కానీ శిల్పా మోహన్ రెడ్డిని చేర్చుకొని ఆయనకు ఉప ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారు. ఇంచార్జులుగా నియమించి, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇస్తే.. అనే సంశయం పలువురిలో ఉందని, దీనిపై ప్లీనరీ అంతర్గత సమావేశాల్లో జగన్ ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. అలాగే వచ్చే ఎన్నికల్లో గెలుపుపై కార్యకర్తల్లో ఉత్సాహం నింపాల్సి ఉంది.