AP Exit Polls 2024: జనం నాడి పట్టుకోలేని ఎగ్జిట్ పోల్స్! పార్టీల వారీగా చీలిన వైనం..!
ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై నిన్న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై తీవ్ర చర్చ జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో ప్రజానాడిని పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్ సంస్థల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ లో అయితే వైసీపీ, లేదంటే ఎన్డీయే కూటమి లేదంటే పోల్స్ కు దూరంగా ఉండే వైఖరి కనిపించింది. దీంతో అసలు ఎగ్జిట్ పోల్ ఏదో, నకిలీ ఏదో తెలియని గందరగోళ పరిస్ధితులు నెలకున్నాయి.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ, ఎన్డీయే కూటమి మధ్య హోరాహోరీ పోరు సాగిందనే విషయం పోలింగ్ రోజే తేలిపోయింది. అయితే ఎంత టఫ్ ఫైట్ ఉన్నా అంతిమంగా ప్రజలు పట్టం గట్టేది ఒకరికి మాత్రమే. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ క్లారిటీ ఇవ్వడంలో విఫలమైనట్లు తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ సైతం ఒపీనియన్ పోల్స్ తరహాలో ఏదో ఒకవైపు మొగ్గు చూపడం లేదా పాక్షిక ఫలితాలు చెప్పి తప్పించుకునే ధోరణే ప్రదర్శించినట్లు అర్దమవుతోంది.

గత చరిత్ర చూసుకుంటే ఉమ్మడి ఏపీలో సైతం ఏ ఎన్నికల్లోనూ హంగ్ తరహాలో ఫలితాలు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఏపీ ప్రజల రాజకీయ వైఖరి ఎన్నికల్లో చాలా స్పష్టంగానే ఉంటుంది. ప్రతీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి, లేదా కూటమికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా ఓటేయడం కనిపిస్తుంటుంది. కానీ ఈసారి ఎగ్జిట్ పోల్స్ గమనిస్తే కొన్ని సంస్థలు ఏకంగా 160 సీట్ల వరకూ ఒక్కో పార్టీకి లేదా కూటమికి కట్టబెట్టేశాయి. దీంతో ఎన్నికలు అంత ఏకపక్షంగా జరిగాయా అని ఓటేసిన వారే ఆశ్చర్యపోతున్నారు.
జాతీయ మీడియా సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్స్ ను గమనించిన లోక్ సభ సీట్ల వరకూ కూటమికి మెగ్గు చూపాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోలికి మాత్రం పోలేదు. గతంలో క్లిక్ అయిన ఎగ్జిట్ పోల్స్ సైతం అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీనికి భిన్నంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కొత్త సంస్థలు లేదా వ్యక్తులు ఎగ్జిట్ పోల్స్ పేరుతో చేసిన హంగామా ఏదో ఒక రాజకీయ పార్టీకి లేదా కూటమికి అనుకూలంగా కనిపించింది. దీంతో అసలేదో, నకిలీది ఏదో తెలియక జనం తలపట్టుకుంటున్న పరిస్ధితి. ఇవి కనీసం బెట్టింగ్స్ కు కూడా ఉపయోగపడే పరిస్ధితి లేదనే వాదన వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications