మాగుంట రాఘవరెడ్డి కస్టడీ పొడిగింపు
డిల్లీ లిక్కర్ స్కాంలో రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10వ తేదీన అరెస్ట్ చేశారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఒంగోలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. రాఘవరెడ్డి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. ఈడీ వాదనను పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు.. 14 రోజుల పాటు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కోర్టులోని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఆదేశాలు జారీ చేశారు.
డిల్లీ లిక్కర్ స్కాంలో రాఘవరెడ్డిని ఫిబ్రవరి 10వ తేదీన అరెస్ట్ చేశారు. అతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఈనెల 13లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని కోర్టు ఆదేశించింది. ఈడీ అధికారులు ఇప్పటికే రాఘవరెడ్డిని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మాగుంట రాఘవరెడ్డి భారీ మొత్తంలో నగదు బదిలీ, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన నేరాల్లో పాల్పంచుకున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్ల ముడుపులను విజయ్ నాయర్ సేకరించారని, వాటిని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలకు అందించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాగుంట రాఘవరెడ్డి, శరత్ చంద్ర, అభిషేక్ బోయినపల్లి సహా పలువురు నిందితులుగా ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ వెల్లడించింది.
ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి నివాసాల్లో దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఈ కేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని, తన కుమారుడిని కావాలనే కుట్రచేసి జైలుకు పంపించారని శ్రీనివాసులరెడ్డి ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications