చిరు ఔట్, జగన్తో ఢీ: పవన్ 'కెసిఆర్' లొల్లి గట్టెక్కించేనా
హైదరాబాద్: సీమాంధ్రలో తమ తమ పార్టీలను అధికారంలోకి తెచ్చేందుకు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ హవా కనిపించడం లేదు. అయినప్పటికీ చిరంజీవి తనవంతుగా కాంగ్రెసు పార్టీ కోసం సీమాంధ్రను చుట్టేస్తున్నారు. సీమాంధ్రలో ప్రధానంగా ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు, జగన్ల మధ్యనే ఉంది.
కాంగ్రెసు పార్టీ రేసులో లేకపోయినప్పటికీ... చిరంజీవి, ఇతర కాంగ్రెసు నేతల్లో ఆశలు మాత్రం ఉన్నాయి. తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకుపోలేదని వారు చెబుతున్నారు. అయితే, 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున వచ్చిన చిరంజీవికి, నేడు కాంగ్రెసు తరఫున ప్రచారం చేస్తున్న చిరంజీవికి... వస్తున్న ప్రజాదరణ చూస్తుంటే మాత్రం కాంగ్రెసు పార్టీ మూడో స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు, జగన్ మధ్యే పోటీ
సీమాంధ్రలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెసు పార్టీ రేసులో ఉందంటున్నారు. ఆ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొందని చెబుతున్నారు. మిగిలిన దాదాపు అన్ని నియోజకవర్గాలలోను జగన్ పార్టీ, టిడిపిల మధ్యనే పోటా పోటీ ఉందని అంటున్నారు. ప్రారంభంలో సర్వేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా ఉండగా... ఇటీవల క్రమంగా ప్రజలు టిడిపి, బిజెపి కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తేల్చాయి.
ప్రజలు ఎటు మొగ్గు చూపుతారనే విషయంలో అందరిలోను ఉత్కంఠ కనిపిస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు, జగన్... ఇద్దరు కూడా సీమాంధ్ర అభివృద్ధి, రాజధాని పైనే ప్రధానంగా దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. తాను సింగపూర్లా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని జగన్ ప్రజలకు చెబుతున్నారు. అంతేకాదు.. తాను ఎలా చేస్తాననే విషయాన్ని ఆయన చెబుతున్నారు. ఇక చంద్రబాబు.. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, హైదరాబాదును తలదన్నే నగరాలను సీమాంధ్రలో నిర్మిస్తానంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వైయస్ జగన్, వైయస్ విజయమ్మ, షర్మిలలు స్టార్ కంపెయినర్లు కాగా, టిడిపి - బిజెపి కూటమికి చంద్రబాబు, మోడీలతో పాటు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్లు ఉన్నారు. ఆయన సీమాంధ్రలో జోరుగా పర్యటిస్తూ టిడిపి, బిజెపి కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. అంతేకాదు... వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరుగుతున్నారు. జైలుకు వెళ్లే జగన్ను గెలిపిస్తే ఏం లాభమని ప్రశ్నిస్తున్నారు. పవన్ పైన జగన్ పార్టీ కూడా ఎదురుదాడి చేస్తోంది.
సీమాంధ్రలో కెసిఆర్ లొల్లి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై సీమాంధ్రలో లొల్లి సాగుతోంది! ప్రధానంగా పవన్ కళ్యాణ్.. దీనిని పదేపదే ప్రశ్నిస్తున్నారు. విభజనకు జగన్ సహకరించారని, హైదరాబాదులోని తన అనుచరుల అక్రమాస్తులు కాపాడుకునేందుకు ఆయన తెలంగాణకు సహకరించారని, కెసిఆర్తో మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని టిడిపితో పాటు పవన్ ఆరోపిస్తున్నారు. కెసిఆర్తో ఎలాంటి ఫిక్సింగ్ లేకుంటే విభజనపై ఆయనను జగన్ ఎందుకు నిలదీయడం లేదని పవన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
టిడిపినే టార్గెట్ చేసిన జగన్
వైయస్ జగన్ సీమాంధ్రలో ప్రధానంగా టిడిపినే లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెసు పార్టీ ఎలాగు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని లెక్కలు వేసుకున్నారు. తమతో పోటా పోటీ ఉందని టిడిపి మాత్రమేనని ఆయన గుర్తించారు. ఈ కారణంగా ఆయన ప్రధానంగా చంద్రబాబు, టిడిపిని, మోడీని, బిజెపిని, వారికి మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ను లక్ష్యంగా పెట్టుకున్నారంటున్నారు. సీమాంధ్రలో కెసిఆర్ గురించి ప్రస్తావించినా లాభం లేదని ఆయన భావిస్తున్నారంటున్నారు.
సీమాంధ్రలో కెసిఆర్ పార్టీ లేనందున... విభజన విషయంలో ఆయన పేరు ఎత్తినా ఎత్తకున్నా వచ్చేది పోయేది ఏమీ లేదని, విభజన పాపం టిడిపి, కాంగ్రెసు పార్టీలదే అని చెప్పడం ద్వారా తమ పార్టీ వైపు ప్రజలను మళ్లించవచ్చునని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. కెసిఆర్ పేరు ఎత్తితే.. అది పరోక్షంగా టిడిపికి, కాంగ్రెసు పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని, విభజన విషయంలో కెసిఆర్ పేరు పెద్దగా ఎత్తక పోవడమే మంచిదని ఆ పార్టీ భావిస్తుండవచ్చునని అంటున్నారు. అయితే, అడపాదడపా తెరాసను మాత్రం వారు నిందిస్తున్నారు.