ఫేస్బుక్ ప్రేమ, బెజవాడలో భేటీ: ముగ్గురి దోపిడీ
విజయవాడ: పోలీసులమంటూ ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని బెదిరించి ఏదు కాసులకు పైగా బంగారాన్ని దోచుకున్నారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జక్కంపూడిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
భీమవరానికి చెందిన మధు అనే యువకుడికి హైదరాబాదులో ఉంటున్న మజ్జి పద్మ (26) అనే యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఖమ్మం జిల్లాకు చెందిన పద్మకు తల్లిదండ్రులు లేరు. పద్మతో పాటు విజయవాడ కొత్తూరు తాడేపల్లికి చెందిన రాజశేఖర్ అనే యువకుడితో మధుకు ఫేస్బుక్లో పరిచయం ఉండేది.

పద్మ, మధుల మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. దాంతో ఇరువురు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో విజయవాడకు గురువారం వస్తున్నానని చెప్పిన పద్మను కలుసుకునేందుకు మధు గురువారం నగరానికి వచ్చాడు. ఇద్దరు కలిసి విజయవాడ శివారు కొత్తూరు తాడేపల్లిలోని మామిడి తోటకు వెళ్లారు.
జక్కంపూడి, షాబాద్ గ్రామాలకు చెందిన రాజేష్, మరో ఇద్దరు యువకులు తోటలోకి వచ్చి పోలీసులమంటూ హంగామా చేశారు. వీరిలో ఒకతను తాను కొత్తపేట ఎస్సైని అని బెదిరించాడు. ఇక్కడ ఏం చేస్తున్నారంటూ గద్దించాడు. దాంతో మధు బెదిరిపోయాడు. అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్తో పాటు మెడలోని గొలుసు, చేతి ఉంగరాలు మొత్తం ఏడు కాసుల బంగారాన్ని లాక్కున్నారు.
మధు, పద్మ తిరిగి వస్తూ విషయాన్ని పోలీసులకు చెప్పారు. వారు వెంటనే రాజేష్తో పాటు మరో ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో రాజశేఖర్ కీలక పాత్ర పోషించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో రాజశేఖర్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు హైదరాబాద్ వెళ్లినట్లు తెలుస్తోంది.
తన మిత్రుడు మధు విజయవాడ వచ్చిన విషయాన్ని రాజశేఖర్ తన మిత్రులకు చెప్పినట్లు, దాంతో వారు నకిలీ పోలీసుల రూపంలో వారిని కలుసుకుని బెదిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications