అన్నీ చెప్పేస్తారు!: నరేంద్ర మోడీ గుంటూరు సభ చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందా?
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ రాకను నిరసిస్తూ తెలుగుదేశం, లెఫ్ట్ పార్టీలు ఆదివారం (ఫిబ్రవరి 10) నిరసన తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ఏపీ పర్యటనను వారు ఊహించిన దాని కంటే విజయవంతం చేయాలని ఏపీ బీజేపీ నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. రాత్రికి రాత్రే మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు కావడం, ఇన్నాళ్లు మోడీని, బీజేపీని పొగిడిన చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం, నిత్యం మోడీనే టార్గెట్గా చేసుకుంటున్న కాంగ్రెస్, లెఫ్ట్కు షాకిచ్చేలా సభను విజయవంతం చేయాలని భావిస్తున్నారు.
అన్నీ చెబుతారు... అందుకే చంద్రబాబుకు భయం
అయితే ప్రత్యేక హోదా లేనప్పటికీ ఏపీకి మోడీ ఎంతో ఇచ్చారని, ఇప్పుడు వాటిని తన సభ ద్వారా చెప్పడం ద్వారా ప్రధాని.. ఏపీ సీఎంకు గట్టి కౌంటర్ ఇస్తారని భావిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం చేసిన సాయాన్ని వివరించనున్నారు. ఈ లక్ష్యంతోనే గుంటూరు కేంద్రంగా ఆదివారం సభను నిర్వహిస్తున్నారు. ఈ మోడీ సభలో ఏపీకి చేసిన సాయం అంతా బయటకు వస్తుందని, అందుకే చంద్రబాబుకు భయం పట్టుకుందని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు తమపై బురద జల్లుతున్నారని, కాబట్టి ఏపీకి ఏం చేశామో స్పష్టంగా ఈ సభ ద్వారా చెప్పనున్నారని అంటున్నారు.
జాగ్రత్తలు తీసుకున్న బీజేపీ
సభకు టీడీపీ శ్రేణుల నుంచి ఏమైనా అవాంతరాలు ఎదురవుతాయనే అంచనాతో బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది ప్రధాని మోడీ ప్రసంగంలో అనేక వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు భయపడుతున్నారని బీజేపీ నేతలు దుయ్యబడుతున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగిన తర్వాత తొలిసారిగా రాష్ట్రంలో జరిగే బహిరంగ సభలో మోడీ ప్రసంగించనున్నారు. అందుకే ఆయన చేయబోయే ప్రసంగం రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. చెన్నై-కోల్కతా జాతీయ రహదారి (ఎన్హెచ్ 16) పక్కన గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ వద్ద సువిశాలమైన ఖాళీ ప్రదేశంలో సభ నిర్వహిస్తున్నారు.
అది ప్రోటోకాల్
ప్రధాని రాకను నిరసిస్తూ వెలువడుతున్న ప్రకటనలు, ఏర్పాటైన కటౌట్లు వంటి వాటికి భయపడేదిలేదని బీజేపీ ఏపీ నేతలు చెబుతున్నారు. బహిరంగ సభకు అవరోధం కల్పించేందుకు ప్రయత్నించడం దారుణమని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా సభ దిగ్విజయం అవుతుందని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహా రావు చెప్పారు. మోడీ కేరళకు వెళ్లినప్పుడు అక్కడి సీఎం విమానాశ్రయానికి వచ్చి స్వాగతించడంతోపాటు వీడ్కోలు కూడా పలికారని, ప్రోటోకాల్ను పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాజకీయాలు, ప్రోటోకాల్ వేరు అన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోందని, అయినా కేంద్రంపై, బీజేపీ మీద టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వాస్తవాలు తెలియజేయటానికి ప్రధాని మోడీ వస్తున్నారని చెప్పారు. మోడీ సభను అడ్డుకుంటే అనంతర పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని జీవీఎల్ హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం దేశంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై నటుడు, బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు తెలుగులో వీడియో పాటకు రూపకల్పన చేయించారు.
కృష్ణపట్నం బీపీసీఎల్ కోస్టల్ టెర్నినల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన
ప్రధాన వేదికపై మోడీతో పాటు కేంద్ర, రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మొత్తం 43మంది ఉండనున్నారు. ఉదయం 11.30 గంటలకు మోడీ ప్రసంగం ప్రారంభిస్తారు. వేదికపై సుమారు గంటపాటు ఉంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి వస్తారు. జన సమీకరణకు ప్రయత్నాలు చేశారు. కృష్ణపట్నం బీపీసీఎల్ కోస్టల్ టెర్నినల్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఓఎన్జీసీ వశిష్ఠ, ఎస్1 అభివృద్ధి పథకాలను, విశాఖపట్నంలో భూగర్భ ముడిచమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేస్తారు.