ఏపీలో నకిలీ చలానాల స్కాం- ఏడుగురు సబ్ రిజిస్టార్లపై వేటు- సాఫ్ట్ వేర్ మార్పు
ఏపీలో చోటు చేసుకున్న నకిలీ చలానాల స్కాంపై ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలోని ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగిన ఈ స్కాంపై ఇప్పటికే వివరాలు సేకరించిన ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా స్కాంకు బాధ్యుల్ని చేస్తూ ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
రాష్ట్రంలో నకిలీ చలానాల స్కాంపై విచారణ వేగవంతం చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు అక్రమాలపై తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భవిష్యత్ లో ఇలాంటి అక్రమాలకి తావులేకుండా సాఫ్ట్ వేర్ లో పూర్తిగా మార్పులు చేశారు. మరోవైపు నకిలీ చలానాల కుంభకోణంపై రెండు రోజులలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సమారు రూ.3 కోట్ల వరకు స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించగా.. ఆ తర్వాత స్ధానంలో ఉన్న కడప జిల్లాలో కోటి రూపాయిలకి పైగా స్కామ్ జరిగినట్లు తెలుస్తోంది.

నకిలీ చలానాల స్కాంలో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన అధికారులు,సిబ్బందిపై చర్యలతో పాటు పోయిన సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ అక్రమాలు బయటపడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 65 లక్షల డాక్యుమెంట్లు పరిశీలించగా.. ఇందులో 30 వేల నకిలీలు బయటపడ్డాయి. దీంతో వీటికి బాధ్యులైన అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వానికి అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. నకిలీ చలానాల స్కాంపై స్వయంగా సీఎం జగన్ ఆరా తీయడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. అసలే రాష్ట్ర ఆర్ధిక పరిస్దితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో ఈ స్కాం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అందుకే కఠిన చర్యలకు వెనుకాడవద్దనే ఆదేశాలు రావడంతో కిందిస్ధాయిలో అధికారులు చర్యలకు దిగుతున్నారు.












Click it and Unblock the Notifications